భవదీయుడు ఉస్తాద్ ఎలా అయ్యాడు

రెండు రోజుల క్రితం తేరి రీమేక్ వద్దని దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేయడం ఏకంగా మూడు లక్షల దాకా ట్వీట్లు వేసేలా చేసింది. ఆ రోజు ఏదో అప్డేట్ ఇద్దామనుకుని వీటి దెబ్బకే ఆగిపోయిన మాట వాస్తవం. కట్ చేస్తే ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేశారు. గతంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ లో చిన్న మార్పు చేసి ఉస్తాద్ తగిలించి పోస్టర్లో అంతకుముందు వాడిన బైక్ టీ గ్లాసు అలాగే ఉంచేసి కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇది బాగానే ఉంది కానీ అభిమానుల్లో బోలెడు అనుమానాలు భయాలు అలాగే ఉండిపోయాయి.

ఇది తేరి రీమేకా కదా అనే సందేహం మాత్రం పట్టి పీడిస్తోంది భవదీయుడు కాస్తా ఉస్తాద్ ఎందుకయ్యాడనేది అందులో ప్రధానమైంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది తేరి లైన్ నుంచి తీసుకున్న స్టోరీనేనట. కాకపోతే అందులో ఫస్ట్ హాఫ్ లో విజయ్ చేసిన బేకరీ ఓనర్ పాత్రని ఇక్కడ కాలేజీ లెక్చరర్ గా మార్చారని టాక్. పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ అలాగే ఉంటుందని కాకపోతే మక్కికి మక్కి వెళ్లకుండా హరీష్ శంకర్ కొన్ని కీలక మార్పులు చేశాడని వినికిడి. అవి విన్నాకే పవన్ ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇది తేరి కాదని హరీష్ తో సహా ఎవరూ ఎక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం

పవన్ కు ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఇలా సేఫ్ గేమ్ ఆడటం కన్నా మరో మార్గం లేదు. ముందు అనుకున్న భవదీయుడుకి చాలా బడ్జెట్ తో పాటు సమయం కూడా అవసరం కావడంతో అది సాధ్యమయ్యే అవకాశం లేదు. అందుకే ఈ ఉస్తాద్ ని ముందుకు తెచ్చారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ ని అంత ఈజీగా గుర్తుపట్టలేనట్టుగా గబ్బర్ సింగ్ తీసి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన హరీష్ శంకర్ మరోసారి ఆ మేజిక్ చేస్తాడని తమ సాటి అభిమానిని పవర్ స్టార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ ఉస్తాద్ ని వచ్చే వేసవికంతా పూర్తి చేసి ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తారు