పవన్ కూడా ప్రభాస్‌లా చేస్తాడా?


అభిమానులు ఎంత వద్దని మొత్తుకుంటున్నప్పటికీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘తెరి’ రీమేక్‌ను పట్టాలెక్కించేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం జరగబోతోంది. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఆదివారమే ఈ కార్యక్రమం జరగబోతోందన్నది విశ్వసనీయ సమాచారం. తెరి రీమేక్ వద్దే వద్దంటూ రెండు రోజుల కిందట పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడం తెలిసిందే.

ఇంతకుముందు మారుతి దర్శకత్వంలో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో కూడా ప్రభాస్ అభిమానుల నుంచి ఇలాంటి నెగెటివిటీ కనిపించింది. వాళ్లు కూడా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి కొన్ని రోజుల పాటు ట్రెండ్ చేశారు. ఈ దెబ్బతో టీం అంతా భయపడిపోయింది. సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా వెనుకంజ వేశారు. ప్రారంభోత్సవ ఫొటోలను, అలాగే షూట్ అప్ డేట్స్‌ను మీడియాతో అస్సలు షేర్ చేసుకోవట్లేదు.

ఆ మధ్య ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మారుతిని ప్రభాస్ సినిమా అప్ డేట్ కోసం అడిగినా.. ఫ్యాన్స్ తనను కొడతారని మారుతి వ్యాఖ్యానించడం అతడిలో ఉన్న భయానికి నిదర్శనం. కట్ చేస్తే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా దాదాపు ఇదే స్థితిలో ఉన్నాడు. ఒక ఆబ్లిగేషన్ మీద హరీష్ తప్పనిసరి పరిస్థితుల్లో ‘తెరి’ రీమేక్ చేస్తుండగా.. పవన్ ఫ్యాన్సేమో తప్పంతా అతడిదే అన్నట్లు టార్గెట్ చేస్తున్నారు. దీంతో మొన్నట్నుంచి వందల మందిని ట్విట్టర్లో బ్లాక్ చేసుకుంటూ వస్తున్నా హరీష్. ఈ సినిమాను నిర్మించబోతున్న మైత్రీ వారికి కూడా నెగెటివిటీ దెబ్బ తగులుతోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ప్రారంభోత్సవాన్ని అఫీషియల్ చేస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. ఈ వేడకకు మీడియాను దూరం పెడుతున్నారు. ఫొటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారా లేదా అన్నది సందేహంగానే ఉంది. అలాగే సినిమా గురించి అధికారిక ప్రకటన ఇస్తారో లేదో కూడా చెప్పలేం. మారుతి లాగే సైలెంటుగా సినిమాను పూర్తి చేసి ఔట్ పుట్‌తో జవాబు చెప్పాలని హరీష్ భావిస్తున్నాడట. కానీ తన సినిమాలను అలా గోప్యంగా ఉంచడం హరీష్‌కు బేసిగ్గా ఇష్టం ఉండదు. అతను సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి ధైర్యం చేసి టీం తరఫు నుంచి అప్ డేట్స్ ఇప్పిస్తాడేమో చూడాలి.