తమన్నా బెట్టు వీడిందబ్బా..

ఒకప్పుడు టాప్ స్టార్లతోనే సినిమాలు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. గత కొన్నేళ్లలో డిమాండ్ తగ్గడంతో.. రేంజ్ తగ్గించుకుని కొన్ని మిడ్ రేంజ్ సినిమాల్లో నటించింది. నందమూరి కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్ లాంటి హీరోలతో జట్టు కట్టింది. ఈ కోవలోనే సత్యదేవ్ లాంటి చిన్న హీరోతోనూ ఓ సినిమా చేసింది. అదే.. గుర్తుందా శీతాకాలం.

ఐతే సినిమా ఒప్పుకోవడం, పూర్తి చేయడం వరకు బాగానే ఉంది కానీ.. ప్రమోషన్ల టైంకి ఏమైందో ఏమో కానీ.. తమన్నా ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసింది. ఇంతకుముందు సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు ఆమె ప్రమోషన్లకు సహకరించలేదు. కనీసం ట్విట్టర్లో ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఏవో కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రాగా.. తమన్నాకు ఈ సినిమా గురించి ఏమాత్రం పట్టింపు ఉన్నట్లు కనిపించలేదు.

ఐతే ఇన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 9న ‘గుర్తుందా శీతాకాలం’ను థియేటర్లలోకి దించేస్తున్నారు. కాగా ఇటీవలే చిత్ర బృందం తమన్నాను రిక్వెస్ట్ చేసి సినిమాను ప్రమోట్ చేయడానికి ఒప్పించారు. తమన్నా ప్రమోషన్లకు వస్తే సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. అది తెలిసే ఆమెను రిక్వెస్ట్ చేయడంతో బెట్టు వీడింది. సోమవారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తమన్నా రావడంతో టీం ఊపిరి పీల్చుకుంది. ఈ ఈవెంట్లో సినిమా గురించి, హీరో సత్యదేవ్ గురించి చాలా బాగా మాట్లాడింది మిల్కీ బ్యూటీ. అటు టీంలోని వాళ్లంతా కూడా తమన్నాను కొనియాడారు.

ఈ ఈవెంట్‌తో ఆగకుండా మంగళవారం మీడియాను కూడా కలిసి సినిమా గురించి మాట్లాడింది తమ్మూ. కొన్నేళ్ల నుంచి తన సినిమాలన్నింటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న తమన్నా.. ఈ సినిమాకు మాత్రం అలా చేయకపోవడం, కొన్నాళ్లు ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోవడం చూస్తే మేకింగ్ టైంలో ఏదో తేడా జరిగిందని అర్థమవుతోంది.