బాలయ్య కోసం ప్రత్యేక అతిథులు

ఆహా కోసం బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 వెరైటీ గెస్టులతో అలరిస్తోంది. ఫస్ట్ సిరీస్ మొత్తం సినిమా సెలబ్రిటీలతో నడవగా ఈసారి మాత్రం పొలిటికల్ టచ్ ఇచ్చారు. మాములుగా ప్రైవేట్ ఇంటర్వ్యూలలో ఎప్పుడూ పాల్గొనని నారా చంద్రబాబునాయుడు, లోకేష్ లు కలిసి ఒక ఎపిసోడ్ చేయడం ఓ రేంజ్ లో మైలేజ్ తెచ్చింది. ఇటీవలే ఏపీ మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ సురేష్ రెడ్డిలనుం తీసుకురావడం కొత్త ఎత్తుగడే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారోననే ఆసక్తి అభిమానుల్లో మొదలయ్యింది. దానికి సంబందించిన లీకులు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి.

ఈసారి 99 ఏళ్ళ తెలుగు సినిమా సందర్భాన్ని పురస్కరించుకుని దిగ్గజాలను పిలవబోతున్నారు. నిర్మాతల బృందం నుంచి అల్లు అరవింద్, సురేష్ బాబు పాల్గొనగా దర్శకుల వైపు నుంచి కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డిలను పిలిచినట్టు సమాచారం. వీడియో కాల్స్ ద్వారా కళాతపస్వి కె విశ్వనాథ్ గారితో పాటు నిన్నటి తరం జేమ్స్ క్యామరూన్ గా పిలవబడే సింగీతం శ్రీనివాసరావు గారి అనుభవాలను పంచుకోబోతున్నట్టు తెలిసింది. కొత్త జనరేషన్ నుంచి స్వప్న దత్, హన్షిత రెడ్డిలను తీసుకువచ్చే ప్రతిపాదన ఉంది. వీళ్లంతా దాదాపుగా కన్ఫర్మ్ అయినవాళ్లే.

రేపో ఎల్లుండో ప్రకటన వచ్చేస్తుంది. పాతికేళ్ల క్రితం జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో చూసినవాళ్లకు బాగా గుర్తే. ముఖ్యంగా లెజెండ్ బిరుదు గురించి చిరంజీవి, మోహన్ బాబు ఇచ్చిన స్పీచులు పెద్ద వివాదమే రేపాయి. దీని ప్రస్తావన కూడా ఈ ఎపిసోడ్ లో ఉంటుందట. మొత్తానికి మంచి అకేషన్ ని తీసుకుని దానికి తగ్గ గెస్టులతో గట్టిగానే ప్లాన్ చేశారు. ఇవన్నీ ఓకే కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ సెలబ్రిటీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అంత త్వరగా అది నెరవేరే సూచనలైతే కనిపించడం లేదు.