ముందు తిట్టుకున్నారు ఇప్పుడు సూపరన్నారు

రెండు రోజుల క్రితం వచ్చిన వాల్తేర్ వీరయ్య బాస్ పార్టీ ప్రోమో సాంగ్ ఎంత ట్రోలింగ్ కు గురయ్యిందో చూశాం. దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ నిరాశ పరిచాడంటూ అభిమానులు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. చిత్ర విచిత్రమైన మీమ్స్ తో ఎంత నిందించాలో అంతా చేశారు. కానీ ఒరిజినల్ సాంగ్ రిలీజయ్యాక సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. వినగానే వాహ్ అనిపించకపోయినా స్లో పాయిజన్ లాగా చూసేకొద్దీ ఎంజాయ్ చేయాలనే తరహాలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వైరల్ అవుతోంది. ఇతర హీరోల డాన్స్ వీడియోలకు ఈ ఆడియోని జత చేసి మరీ రచ్చ చేస్తున్నారు. వేర్ ఈజ్ ద పార్టీ అంటూ కవ్వించిన ట్యూన్ ఫైనల్ గా పాస్ అయ్యింది.

ఇలా జరగడం దేవికి మొదటిసారి కాదు. పుష్పలో ఊ అంటావా ఊహు అంటావా వచ్చినప్పుడు నెగటివ్ ట్రెండింగ్ బాగానే జరిగింది. కట్ చేస్తే సినిమా రిలీజయ్యాక టాప్ ఛార్ట్ బస్టర్ గా నిలవడమే కాదు ఎక్కడ చూసినా ఇదే మారుమ్రోగిపోయింది. రంగస్థలంలో జిగేలు రాణి, ఖైదీ నెంబర్ 150లో అమ్ముడు కుమ్ముడు సైతం ఈ తరహా స్పందనలు తెచ్చుకున్నవే. అందుకే దేవి ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ వచ్చే దాకా వెయిట్ చేసి ఆ తర్వాత హ్యాపీ అయ్యారు. చిరు స్టెప్స్ కి రిపీట్ వ్యూస్ వస్తున్నాయి. ఇరవై నాలుగు గంటలు దాటకుండానే పది మిలియన్ల వ్యూస్ కి దగ్గరగా వెళ్తోందీ బాస్ పార్టీ.

మొత్తానికి వాల్తేర్ వీరయ్య ప్రమోషన్లకు బాస్ పార్టీ ఒక ఊపు తెచ్చేసింది. చిరంజీవిని ఊర మాస్ గా చూపిస్తానని దర్శకుడు బాబీ పదే పదే అన్న మాటను నమ్మొచ్చనేలా ఇప్పటిదాకా జరిగిన ప్రమోషన్ ఋజువు చేసింది. ముందు తిట్టుకున్నా దేవి విషయంలో ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇక నెక్స్ట్ బాలయ్య వంతు రాబోతోంది. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగల్ రేపు రిలీజ్ చేయబోతున్నారు. దేవికి ధీటుగా తమన్ ఎలాంటి పాట ఇచ్చాడోననే అంచనాలు మొదలైపోయాయి. ఇదంతా ఓకే కానీ మెగా మూవీలో మిగిలిన మూడు పాటలు కూడా ఇదే రేంజ్ లో ఇచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఫిక్సవొచ్చు.