దృశ్యం-2.. ఛాన్స్ మిస్సయ్యారుగా

రీమేక్ సినిమాలు అన్ని చోట్లా బోల్తా కొడుతున్న సమయం ఇది. ఏదో ఒకటీ అరా సినిమాలు తప్ప రీమేక్‌లు పెద్దగా ఆడట్లేదు. మార్పులు చేర్పులు చేసి కొత్త లుక్‌లోకి తెచ్చినా కూడా ప్రేక్షకులు రీమేక్‌ల పట్ల అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇటీవలే తెలుగులో ‘గాడ్ ఫాదర్’ యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. ఐతే ఇప్పుడు హిందీలో ఒక రీమేక్ మూవీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ చిత్రమే.. దృశ్యం-2.

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ను రీమేక్ చేసిన అజయ్ దేవగణ్.. దాని సీక్వెల్‌లోనూ నటించాడు. ఆయనకు జోడీగా శ్రియ నటించిన ఈ చిత్రం గత వారాంతంలోనే విడుదలైంది. రిలీజ్‌‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపించిన ఊపు.. రిలీజ్ తర్వాత ఇంకా పెరిగింది. వీకెండ్లో వరల్డ్ వైడ్ 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా సాధించిన విజయం చూసి.. మలయాళం, తెలుగు వెర్షన్ల విషయంలో తప్పు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్న టైంలోనే ‘దృశ్యం-2’ మలయాళ వెర్షన్ నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. సినిమా మొదలయ్యేటపుడే ప్రైమ్ వాళ్లతో డీల్ చేసుకుని రంగంలోకి దిగారు. రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు కానీ.. స్ట్రీమ్ అయ్యాక సినిమా చూసి షాకయిపోయారు జనం. ఆ చిత్రాన్ని ప్రైమ్‌లో విరగబడి చూశారు. అధి కనుక థియేటర్లలో రిలీజై ఉంటే ‘దృశ్యం’ లాగే సెన్సేషన్ క్రియేట్ చేసేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో వెంకీ హీరోగా రీమేక్ చేశారు. అది కూడా ప్రైమ్‌లోనే రిలీజైంది. తెలుగులో అయినా ‘దృశ్యం-2’ను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే మంచి ఫలితమే అందుకుని ఉండేదేమో. ఆల్రెడీ తెలుగు, మలయాళంలో ఓటీటీల్లో అందుబాటులో ఉన్నా సరే.. హిందీ వెర్షన్ ఇరగాడేస్తుండడాన్ని బట్టి ‘దృశ్యం’ సీక్వెల్ పట్ల జనాల్లో ఉన్న ఆసక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.