లైగర్ ఇప్పట్లో వదలని పీడకల

నిన్న లైగర్ పెట్టుబడులకు సంబంధించి ఫెమా యాక్ట్ కింద పూరి ఛార్మీలను ఈడి అధికారులు దాదాపు ఒక రోజంతా ప్రశ్నించడం పెద్ద దుమారమే రేపుతోంది. విదేశీ పెట్టుబడులను ఇల్లీగల్ గా తీసుకొచ్చినప్పుడు ఈ చట్టాన్ని వాడతారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఫిర్యాదు ఎవరు చేసినా పక్కా ఆధారాలు క్లూస్ ఉంటే తప్ప అనుమానితులకు నోటీసులు వెళ్లవు. పైగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయం కాబట్టి తొందరపడటం లాంటివి ఉండవు. డిస్ట్రిబ్యూటర్లతో వివాదంతోనే బాగా బద్నాం అయిన పూరికి ఇప్పుడీ విచారణ అంత మేలు చేసేది కాదు. కొంచెం సీరియస్సే.

అప్పుడెప్పుడో డ్రగ్స్ కేసు నుంచి బయట పడినంత ఈజీగా క్లీన్ చిట్ రాకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఆఫీసర్ల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సరే ఇదంతా కాసేపు పక్కనపెడితే లైగర్ లో అన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టేంత ఖర్చు ఏముందనే అనుమానం మళ్ళీ వస్తోంది. నిజానికది ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ లాగా విజువల్ గ్రాండియర్ కాదు. ఆ మాటకొస్తే సగం సినిమా ఇంటీరియర్ లోనే సాగుతుంది. బాక్సింగ్ రింగ్, విదేశాల్లో కొంత భాగం, ముంబై అవుట్ డోర్ తప్ప ఇంకేం ఉండదు. అలాంటి దానికి బయట నుంచి అక్రమ మార్గాల్లో పెట్టుబడులు వచ్చాయంటే షాకే.

చూస్తుంటే లైగర్ తాలూకు పీడకల ఇప్పట్లో పూరిని వదిలేలా లేదు. మొదలుపెట్టిన జనగణమన క్యాన్సిల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ టైంలో మాటిచ్చిన హీరోలు ఇప్పుడు స్పందించడం లేదు. ఎవరి దాకో ఎందుకు రామే సీక్వెల్ చేద్దామంటే ఒప్పుకోకపోవచ్చు. కొడుకు ఆకాష్ ని పెట్టి ఏదైనా కొత్త మూవీ తీద్దామన్నా బడ్జెట్ లు, బిజినెస్ లు వర్కౌట్ అయ్యేలా లేవు. ఇదంతా లైగర్ వల్లే. పైగా బయ్యర్లతో పెట్టుకున్న గొడవ భవిష్యత్తులో ప్రభావం చూపించేలా ఉంది. ఇన్ని రకాలుగా పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన పూరి అందులో నుంచి బయటికి రావడం ఎలాగో చూడాలి. తన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ట్విస్టులు పడుతున్నాయి.