పూరి, ఛార్మిలపై ఈడీ విచారణ?

లైగర్ సినిమా రిలీజై మూడు నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా గురించి చర్చలు, వివాదాలు మాత్రం ఇంకా ఆగట్లేదు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. సినిమా గురించి విజయ్, పూరి ఇచ్చిన బిల్డప్‌కి, తెర మీద చూసిందానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో రిలీజ్ టైంలో దాని మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంతా మూవ్ ఆన్ అయినట్లే కనిపించారు. బయ్యర్లకు కూడా నష్టపరిహారం సెటిల్ చేయడానికి పూరి ముందుకు రావడంతో ఆ సినిమా వ్యవహారం ముగిసిన కథగా భావించారు.

కానీ కొన్ని వారాల కిందట బయ్యర్లు.. పూరి ఆఫీస్ ముందు ఆందోళనకు సిద్ధం కావడం.. ఈ విషయం తెలుసుకున్న పూరి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఫోన్ కాల్ లీక్ అవడం.. ఆ తర్వాత ఆయన బయ్యర్లు, ఫైనాన్షియర్ల మీద ఫిర్యాదు చేయడం.. వాళ్లు పూరి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం తెలిసిందే.

ఆ తర్వాత ఆ వివాదం ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ దృష్టి ‘లైగర్’ టీం మీద పడిందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారనే అనుమానం రావడంతోనే ఈడీ ఫోకస్ పెట్టిందట. ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన పూరి జగన్నాథ్, ఆయన నిర్మాణ భాగస్వామి ఛార్మి కౌర్‌లను పిలిచి విచారిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ‘లైగర్’ టీం అతిక్రమించిందని.. పెట్టుబడుల విషయంలో చాలా అనుమానాలున్నాయని, అందుకే ఈడీ అధికారులు ఈ చిత్ర నిర్మాతలైన పూరి, ఛార్మిలను విచారిస్తున్నారని అంటున్నారు. మరి రాజకీయ నేతలు సినిమాలో బ్లాక్‌ మనీని పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలే నిజం అయితే బయ్యర్లకు సెటిల్మెంట్ విషయంలో అంత గొడవ జరగడం ఆశ్చర్యకరం. మరి ఈ విచారణలో ఈడీ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.