మహేష్‌‌ని నింధించడం కరక్టేనా?

సూపర్ స్టార్ కృష్ణ దహనసంస్కారాలు ఒక ప్రైవేట్ ల్యాండ్‌లో చేయలేదని, ఒక చిన్నపాటి మెమోరియల్ కట్టిస్తే బాగుంటుందని అనడం వేరు, ఎవరు చెప్పినా వినకుండా మహేష్‌ బాబు అలా కానిచ్చేశాడు అంటూ ఇప్పుడు కొంతమంది నిప్పులుకక్కుతున్న సంగతి తెలిసిందే. రేపోమాపో ఇదో పెద్ద న్యూస్ చానల్లో ప్రైమ్ డిబేట్‌గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే తన తండ్రిని ఎక్కడ ఖననం చేయాలి, తదుపరి ఏం చేయాలి అనే విషయంలో మహేష్‌ బాబుకు సొంతంగా నిర్ణయం తీసుకునే ఛాన్సే లేదన్నట్లు ఎద్దేవా చేయడం కరక్టేనా?

నిజానికి హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించుకున్న ఈ పాతతరం సినిమా పెద్దలు చనిపోతే.. దాదాపు అందరూ స్టూడియోల్లోనే అంత్యక్రియులు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్, రామానాయుడు స్టూడియోలో రామానాయుడు సమాధిని కట్టించి స్మృతిచిహ్నాలను కూడా ఏర్పాటు చేశారు.

మరి కృష్ణగారికి కూడా అదే తరహా గౌరవం ఇవ్వాలంటే పద్మాలయ స్టూడియోస్ లో అంత్యక్రియలు చేసుండాల్సింది. కాని దానిని ఎప్పుడో అమ్మేశారు కాబట్టి, ఇప్పుడు అక్కడ కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. పైగా అది కూడా కొన్ని ల్యాండ్ మ్యుటేషన్ తాలూకు లీగల్ చిక్కుల్లో ఉందంటూ అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ వస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్లతో దున్నించడమే కాదు, జీ-గ్రూప్‌కు ఇచ్చేసిన పద్మాలయ భూములను లాక్కుంటాం అంటూ అప్పట్లో ఇప్పటి సిఎం కెసిఆర్ అలాగే ఎమ్మెల్యే హరీశ్ రావ్ లు పెద్ద ఎత్తునే శపథాలు కూడా చేశారు. మరి అలాంటి ఇష్యూ ఏమన్నా ఉండటం వలన ఇప్పుడు కృష్ణ గారి అంత్యక్రియలను పద్మాలయలో మిగిలిన భూమిలో చేయలేదా అనే విషయం కూడా ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు.

ఇకపోతే తన తండ్రిని ఎక్కడ ఖననం చేయాలి, ఎక్కడ సమాధి కట్టాలి అనేది పూర్తిగా మహేష్‌ వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన తండ్రి. మనకి సూపర్ స్టార్ అయినా కూడా, ఆయనకు ముందు తండ్రి. కాబట్టి ఆ విషయంలో ఇతరులు అవాకులు చివాకులు పేలడం కరక్ట్ కాదు. హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే, మనిషిని ఖననం చేయాల్సిందే. అది కూడా అందరినీ దహనం చేసే ఆ స్మశానవాటికలో చేసినప్పుడే.. అందరూ సమానం అనే ఫీలింగ్ వస్తుంది. ఏమో, మహేష్‌ ఆ విధంగా ఆలోచించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపాడేమో, తెలియదు కదా. బాలీవుడ్ లో రిషి కపూర్ వంటి లెజెండ్స్ అంత్యక్రియలు కూడా కామన్ స్మశానవాటికల్లోనే జరిగాయి. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా రచ్చ చేయడం కరక్ట్ కాదు.