ఇదేం కాంబినేషనయ్యా?

ఒక భాషలో విజయవంతం అయిన సినిమాను ఇంకో భాషలో పునర్నిర్మిస్తే చాలా ఈజీగా హిట్టు కొట్టేయొచ్చు అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు రీమేక్‌లు చాలా ప్రమాదకరంగా మారిపోయాయి. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం తర్వాత అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తుండడంతో రీమేక్‌ల పట్ల పెద్దగా ఆసక్తి ఉండట్లేదు. వరుసగా రీమేక్‌లకు ప్రతికూల ఫలితాలు వస్తున్నా సరే.. ఆ సినిమాలు మాత్రం ఆగట్లేదు.

తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ‘లూసిఫర్’ లాంటి సినిమాను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన చిరంజీవి అండ్ టీం ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయింది. మంచి టాక్ వచ్చినా వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో తమిళ బ్లాక్‌బస్టర్ మానాడును తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతుండడం విశేషం. ఈ సినిమా సైతం ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉండడం గమనార్హం.

ఐతే వేరే భాషల చిత్రాలకు మార్పులు చేర్పులు చేసి బాగా తెలుగీకరిస్తాడని పేరున్న హరీష్ శంకర్.. మానాడు తెలుగు వెర్షన్‌కు స్క్రిప్టు అందిస్తున్నాడన్నది తాజా సమాచారం. ఆ పనిని ఆల్రెడీ హరీష్ పూర్తి చేశాడట. ఇంతకీ మానాడు రీమేక్‌కు దర్శకుడు.. ప్రధాన పాత్రధారులు ఎవరు అన్నది ఆసక్తి రేకెత్తించే విషయం. కెరీర్ ఆరంభంలో సంతోషం, కొంచెం గ్యాప్ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్లు తీసి ఆ తర్వాత కనుమరుగైపోయిన సీనియర్ దర్శకుడు దశరథ్ మానాడు రీమేక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట.

ఆయన చివరి రెండు చిత్రాలు శౌర్య, గ్రీకువీరుడు పెద్ద డిజాస్టర్లవడం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరోగా శింబు పాత్రను రవితేజ, విలన్‌గా ఎస్.జె.సూర్య క్యారెక్టర్ని సిద్ధు జొన్నలగడ్డ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ పాత్రలకు వీళ్లు కరెక్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అసలే తెలుగులో అందుబాటులో ఉన్న సినిమాకు రీమేక్.. ఇంకోవైపేమో ఫామ్‌లో లేని డైెరెక్టర్.. మరోవైపు సందేహాలు రేకెత్తించే కాస్టింగ్.. ఇలా ఏ రకంగా చూసినా మానాడు రీమేక్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.