ఓరి దేవుడా.. రూల్స్ వర్తించవా?

కొన్ని నెలల కిందట టాలీవుడ్‌లో జరిగిన స్ట్రైక్ గురించి తెలిసిందే. మామూలుగా సినీ కార్మికులు తమ డిమాండ్లతో షూటింగ్స్ ఆపేంచేయడం చూస్తుంటాం. కానీ ఈ ఆగస్టు నెలలో పెద్ద నిర్మాతలే ఉమ్మడి నిర్ణయంతో షూటింగ్స్‌కు బ్రేకులు వేశారు. తిరోగమనంలో పయనిస్తున్న ఇండస్ట్రీని గాడిన పెట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆ సమయంలో తమకు తాముగా షూటింగ్స్ ఆపుకుని సమావేశాలు నిర్వహించారు.

ఓటీటీల్లో త్వరత్వరగా కొత్త సినిమాలు రిలీజవుతుండడం వల్ల థియేట్రికల్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయని.. తాత్కాలిక ప్రయోజనం గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో భారీ నష్టాలు తప్పవని భావించి థియేటర్లలో రిలీజైన 50 రోజులకు కానీ కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తీర్మానించారు. గతంలోనూ ఇలాంటి తీర్మానాలు జరిగినప్పటికీ.. ఈసారి కఠినంగా షరతును పాటించేలా నిర్మాతల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లే కనిపించింది. ఈ తీర్మానం జరిగిన టైంలో రిలీజైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాల విషయంలో కొంచెం కఠినంగానే ఈ నిబంధన అమలు చేశారు.

సరిగ్గా 50 రోజుల తర్వాత కాకపోయినా ఐదు వారాల తర్వాతే ఈ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఆలస్యంగా వచ్చినా ఈ సినిమాలకు ఓటీటీల్లో మంచి స్పందనే వచ్చింది. వీటి థియేట్రికల్ రన్ కూడా ఎక్కువ రోజులు సాగింది. కానీ ఈ రూల్‌ మిగతా అన్ని సినిమాలకు కూడా మాత్రం వర్తింపజేయలేకపోతున్నారు. దసరా సినిమాల్లో ‘స్వాతిముత్యం’ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

‘ది ఘోస్ట్’ కూడా నెల రోజులకే ఓటీటీలో అడుగు పెట్టింది. ఇక దీపావళి సినిమా ‘ఓరి దేవుడా’ అయితే 20 రోజుల్లోపే ఆహాలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో దిల్ రాజు, పీవీపీ లాంటి పెద్ద నిర్మాతలు భాగస్వాములు. ఇలాంటి పెద్ద నిర్మాతలే తాము పెట్టుకున్న రూల్‌ను బ్రేక్ చేసి ఒక పేరున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి వదిలేస్తే మిగతా ప్రొడ్యూసర్లు ఈ రూల్‌ను ఏం పాటిస్తారనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.