యాడ్ చేస్తున్నాడా? కథ చెబుతున్నాడా??

‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ తో తీయాల్సిన దర్శకుడు హరీశ్ శంకర్.. జనసేనాని పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమాను టేకాఫ్‌ చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం సడన్ గా మనోడు ముంబయ్ లో ఉండటంతో.. రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కు కథ చెబుతున్నాడంటూ టాక్ వస్తోంది. ఇంతకీ అది నిజమేనా?

వాస్తవానికి గత ఆర్నెల్లుగా యాడ్స్ చేయడంలో ఫుల్ బిజీ అయిపోయాడు హరీశ్ శంకర్. అల్లు అర్జున్ వంటి స్టార్లతో పెద్ద బ్రాండ్ యాడ్స్ తీసిన ఈ గబ్బర్ సింగ్ డైరక్టర్.. చిన్న చిన్న ఫుడ్ కంపెనీ యాడ్స్ కూడా తీస్తున్నాడట. అసలు మోడల్స్ ఎవ్వరూ లేకుండా ఉండే ప్రోడక్ట్ యాడ్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ముంబాయ్‌లో కూడా ఒక ఫుడ్ బ్రాండ్ యాడ్ షూట్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌ను చూసుకోవడానికి వెళ్లాడని ప్రొడక్షన్ సర్కిల్స్‌లో టాక్. కాని బయటకు మాత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు సల్మాన్ ఖాన్‌కు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి, భాయ్‌కు కథ చెప్పడానికి వెళ్లాడని అంటున్నారు. కాకపోతే భాయ్‌ను కలిసే ప్లాన్ కూడా ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు భాయ్‌తో సినిమా టేకాఫ్‌ అవ్వడం మాత్రం చాలా కష్టమైన విషయమని ఆయన లైనప్ తెలిసిన బాలీవుడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

మొత్తానికి హరీశ్‌ శంకర్ యాడ్స్ చేస్తున్నాడా లేదంటే కథ చెప్పడానికే బాంబే వెళ్ళాడా అనే విషయం ఇంకా తెలియదు కాని, ఈ దర్శకుడు త్వరగా ఒక సినిమాను పట్టాలెక్కిస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పంచ్‌లను ప్రేమించేవాళ్ళూ, కామెడీ టైమింగ్‌ను ఆరాధించేవాళ్లు.. మరి హరీశ్ సినిమా కోసం కళ్ళలో క్యాండిల్స్ పెట్టుకుని ఎదురు చూడకుండా ఎందుకుంటారు!?