దిల్ రాజు చేతికి చిన్న సినిమా

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. అప్పుడప్పుడూ బయటి వాళ్లు చిన్న సినిమాలు నచ్చి తన బేనర్ మీద రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ చిన్న చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమా పేరు.. మసూద. ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన తిరువీర్ ఇందులో హీరోగా నటించగా.. ‘ఖడ్గం’ సహా చాలా సినిమాలతో ఆకట్టుకున్న సీనియర్ నటి సంగీత ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించింది.

‘గంగోత్రి’లో బాల నటిగా ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్ర చేసింది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్‌ను కొన్ని రోజుల కిందటే నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ పరంగా రిచ్‌గానే కనిపించి ‘మసూద’. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది.

ఇది నజియా అనే ఓ ముస్లిం అమ్మాయి చుట్టూ తిరిగే కథ. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. దయ్యాన్ని చూశానని చెప్పి తాను భయపడడమే కాక అందరినీ భయపెట్టడం.. తనను మామూలు మనిషిని చేయడానికి తన వాళ్లు పడే తాపత్రయం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సంగీత ఇందులో సైన్స్ టీచర్ పాత్ర పోషించింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 18న ‘మసూదను’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజుతో పాటు ‘మసూద’ టీం అంతా పాల్గొంది.


రాహుల్ యాద‌వ్ నిర్మించిన తొలి రెండు చిత్రాల‌కు తాను అభిమానిన‌ని.. అత‌ను తీసే మూడో సినిమాను తాను రిలీజ్ చేస్తాన‌ని ముందే మాట ఇచ్చాన‌ని, ఆ ప్ర‌కార‌మే మ‌సూద మూవీతో అసోసియేట్ అయ్యాన‌ని రాజు తెలిపాడు. ఇంకా మ‌సూద సినిమా చూడ‌క‌ముందే రాజు దీన్ని త‌న బేన‌ర్ మీద రిలీజ్ చేయ‌డానికి డిసైడ‌య్యాడ‌ట‌. టీజ‌ర్ చాలా బాగుంద‌ని, త్వ‌ర‌లోనే సినిమా చూడ‌బోతున్నాన‌ని రాజు తెలిపాడు.