నేను రాంగ్.. నాన్నే రైట్-అల్లు శిరీష్

టాలీవుడ్లో నిన్నటి తరం లెజెండరీ, సీనియర్ ప్రొడ్యూసర్లు చాలామంది దుకాణం కట్టేసి తెరమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఇంకా యాక్టివ్‌గా సినిమాలు తీస్తూ, మంచి సక్సెస్ రేట్‌తో దూసుకెళ్తున్నారు. 70 ఏళ్లు పైబడ్డా సరే.. ఇప్పటి ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకుని సినిమాలు నిర్మిస్తూ, సినిమా ఫలితాలతను సరిగ్గా జడ్జ్ చస్తూ ముందుకు సాగుతుండటం అరవింద్‌కే చెల్లింది.

ఆయన చిన్న కొడుకు అల్లు శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కథల జడ్జిమెంట్ విషయంలో తన తండ్రికి తిరుగులేదని, అది తన సినిమాల విషయంలోనే అనుభవపూర్వకంగా అర్థమైందని చెప్పాడు. ‘ఊర్వశివో రాక్షసివో’ ఒరిజినల్ ‘ప్రేమ ప్యార్ కాదల్’ చూసి.. ఈ కథ తనకు నప్పుతుందని, ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మి తనకు సజెస్ట్ చేసింది తన తండ్రే అని వెల్లడించాడు.

‘‘ఇంతకుముందు నేను చేసిన గౌరవం, ఒక్క క్షణం, ఏబీసీడీ.. ఇవన్నీ నేను నా సొంత నిర్ణయాలతో ఎంచుకున్న సినిమాలు. మా నాన్న వద్దు అని చెప్పిన కథలు కూడా చేశాను. ఊర్వశివో రాక్షసివో కథ నచ్చి ఆయన ఈ సినిమాను నిర్మిద్దామని అనుకున్నాక నేను హీరో పాత్రకు సెట్టవుతానని భావించి నాతోనే సినిమా తీశారు. ఈ సినిమా ఫలితం చూశాక సినిమాల గురించి నా కంటే నాన్నకు ఎక్కువ తెలుసు అనిపించింది. జడ్జిమెంట్ విషయంలో ఆయనే రైట్ అని అర్థమైంది. ఇక ముందు ఆయన ఓకే అంటేనే సినిమా చేస్తా. వద్దు అంటే చేయదలుచుకోలేదు’’ అని శిరీష్ స్పష్టం చేశాడు.

తన కెరీర్ విషయంలోనే కాక వ్యక్తిగా ఎదుగుదలలోనూ తన తండ్రి పాత్ర కీలకమని చెబుతూ.. యుక్త వయసులో కారు కొనివ్వమని అడిగితే తన తండ్రి ఎంత తీవ్రంగా స్పందించాడో గుర్తు చేసుకున్నాడు శిరీష్. ‘‘అప్పట్లో నాకు డబ్బు విలువ తెలిసేది కాదు. 21 ఏళ్లు రాగానే నాన్న దగ్గరికి వెళ్లి ఫలానా నిర్మాత కొడుకు దగ్గర కారుంది. నాకెందుకు కొనివ్వవు అని అడిగాను. చెప్పు తీసుకుని కొడతా.. అంటూ నాన్న కోప్పడ్డారు. నేను ఇవ్వాలనుకున్న డబ్బులు ఇస్తా, మిగతావి నువ్వు సంపాదించుకుని కారు కొనుక్కో అన్నారు. ఆ డబ్బులు సంపాదించి కారు కొనుక్కోవడానికి మూడేళ్లు పట్టింది. డబ్బు విలువ తెలియాలనే నాన్న అలా చేశారు. ఆయన చేసింది కరెక్ట్ అని తర్వాత అర్థమైంది’’ అని శిరీష్ చెప్పాడు.