కొర‌టాల ద‌ర్శ‌న‌మిచ్చాడ‌బ్బా

ఆచార్య సినిమా రిలీజై ఆరు నెల‌లు దాటిపోయింది. ఈ ఆరు నెల‌ల్లో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ బ‌య‌టెక్క‌డా క‌నిపించ‌లేదు. ఆ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన కొర‌టాల.. సినిమా దారుణ‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో అడ్ర‌స్ లేకుండా పోయాడు. ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు ముసురుకున్నా, వాటిని నాలుగు గోడ‌ల మ‌ధ్య డీల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడే త‌ప్ప బ‌య‌టికి రాలేదు.

ఆచార్య హీరో చిరంజీవి ప‌రోక్షంగా కొర‌టాలను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేసినా, ఆయ‌న్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేసినా కొర‌టాల వైపు నుంచి సౌండ్ లేదు. ఎలాగూ సోష‌ల్ మీడియాలో కూడా లేడు కాబ‌ట్టి వాటికి స‌మాధానం చెప్పే అవ‌కాశం లేక‌పోయింది. ఆచార్య బాధ ఒకెత్త‌యితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా స‌కాలంలో మొద‌లు కాక‌పోవ‌డం మ‌రో బాధ‌.

గ‌త కొన్ని నెల‌ల నుంచి ఎన్టీఆర్ సినిమా గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆ ప్రాజెక్టు మీద ప్ర‌శ్న‌లు రేకెత్తాయి. కొన్ని రోజుల కింద‌ట ఈ సినిమా ప‌క్కాగా ఉంటుంద‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చారే త‌ప్ప‌.. అధికారికంగా చిత్ర బృందం నుంచి ఏ అప్‌డేట్ లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేల‌కు కొర‌టాల మ‌ళ్లీ మీడియాలోకి వ‌చ్చాడు. తార‌క్‌తో చేయ‌బోయే సినిమాకు సంబంధించి సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌ల‌తో కొర‌టాల చ‌ర్చిస్తున్న ఫొటోల‌ను మీడియాకు రిలీజ్ చేశారు.

ఎట్ట‌కేల‌కు కొర‌టాల మ‌ళ్లీ క‌నిపించ‌డం, ఎన్టీఆర్ సినిమా ముందుకు క‌దులుతున్న సంకేతాలు ఇవ్వ‌డంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు తార‌క్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. కొర‌టాల మిత్రుడు మిక్కిలినేని సుధాక‌ర్‌తో క‌లిసి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. మ‌రి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.