PS 2 తీసేసుకున్న మహేష్ డేట్

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తల్లి మరణం తర్వాత ఆ విషాదం నుంచి బయట పడేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఇటీవలే తిరిగి వచ్చేశాడు. కొత్త షెడ్యూల్ వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ లోగా స్క్రిప్ట్ విషయంలో హీరోకి దర్శకుడికి పూర్తి ఏకాభిప్రాయం రాలేదనే వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినా అందులోనూ సరైన క్లారిటీ లేకపోయింది. మొత్తానికి వెయిటింగ్ అయితే తప్పదు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విడుదల తేదీ గతంలోనే ఫిక్స్ చేశారు. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని అఫీషియల్ గా చెప్పారు. కానీ ఇప్పుడది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. నవంబర్ లేదా డిసెంబర్ కి షిఫ్ట్ కాక తప్పదని ఒకవేళ అదీ వద్దనుకుంటే హ్యాపీగా 2024 సంక్రాంతికి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదని ఘట్టమనేని వర్గాల నుంచి వస్తున్న లీక్. సమ్మర్ లో మంచి డేట్ అది కూడా పోకిరి, అడవిరాముడు, బాహుబలి 2 లాంటి వాటికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన స్లాట్. దాన్ని మిస్ చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీలవుతారు.

ఈలోగా పీఎస్ 2 సూపర్ స్టార్ డేట్ ని తీసేసుకుందని చెన్నై అప్ డేట్. ఏప్రిల్ 28 పొన్నియన్ సెల్వన్ రెండో భాగం రావడం కన్ఫర్మ్ అయినట్టే. ఈమేరకు ఇవాళో రేపో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తారు. తమిళంలో నాలుగు వందల కోట్లు రాబట్టిన ఈ పీరియాడిక్ డ్రామా ఇతర భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయింది. అయితే అసలు కథ పీఎస్ 2లోనే ఉంటుందని, ఫస్ట్ పార్ట్ తో సంతృప్తి చెందని వాళ్ళను థ్రిల్ చేస్తుందని మణిరత్నం టీమ్ అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ కు ఒక మంచి సీజన్ మిస్ అయినట్టే. పీఎస్ 2 షూటింగ్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి వాళ్లకు టెన్షన్ లేదు.