దయనీయ స్థితిలో ఆ విలన్

Ponambalam

పొన్నాంబళం.. అటు తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు వాళ్లు కూడా అంత సులువుగా మరిచిపోలేని విలన్. 90ల్లో సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న విలన్లలో అతనొకడు. మరీ లీడ్ విలన్ పాత్రలు చేసేవాడు కాదు కానీ.. హీరో మీద ఎటాక్ చేయించడానికి మెయిన్ విలన్ వాడుకునే రౌడీ పాత్ర అనగానే అందరికీ పొన్నాంబళమే గుర్తుకొచ్చేవాడు.

భయం గొలిపేలా విలనీని పండించడంలో పొన్నాంబళం స్టయిలే వేరుగా ఉండేది. అతడితో హీరోకు ఫైట్ పెడితే సినిమాలో అదో హైలైట్‌గా ఉండేది. తమిళంలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పని చేసిన పొన్నాంబళం.. తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో తరచుగా కనిపించేవాడు. ఐతే 2000 తర్వాత అతడికి సినిమాలు తగ్గిపోయాయి. నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు.

ఐతే ఇప్పుడు పొన్నాంబళం మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను దయనీయ స్థితిలో ఉన్నట్లు తమిళ మీడియా వెల్లడించింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న పొన్నాంబళం.. చికిత్సకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్లుగా సంపాదన లేక, ఆస్తి మొత్తం కరిగిపోయి.. అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలూ పెరిగిపోయి.. సాయం కోసం అర్థించే స్థితికి చేరుకున్నాడు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ కథానాయకుడు, రాజకీయ నేత కమల్ హాసన్.. పొన్నాంబళంకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

అతడి చికిత్స కోసం సాయం చేస్తానని.. అలాగే పొన్నాంబళం పిల్లల చదువుకు అయ్యే ఖర్చును కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు. కమల్‌తో పొన్నాంబళం అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు సహా మరెన్నో సినిమాల్లో నటించాడు. కమల్ స్పందన చూశాక మరింతమంది కోలీవుడ్ సెలబ్రెటీలు పొన్నాంబళంకు సాయం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నారు.