తెలుగులో నుయ్యి తమిళంలో గొయ్యి

సంక్రాంతికి జరుగుతున్న బాక్సాఫీస్ పోటీ చూస్తుంటే అచ్చంగా ఇదే సామెత గుర్తొస్తోంది. మేమెంటే మేమంటూ ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితులు లేకపోవడం నిర్మాతల కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనెప్పిగా మారుతోంది. ముఖ్యంగా విజయ్ తో వారసుడు నిర్మిస్తున్న దిల్ రాజు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. పొంగల్ రేస్ నుంచి తప్పించాలంటే హీరో ఒప్పుకోడు. ఆ పండగ వదులుకోవడమంటే ఎంతలేదన్నా ఓ పది ఇరవై కోట్ల దాకా వసూళ్లలో కోత పడినట్టే. పైగా అజిత్ తునివు వస్తున్నందుకు డ్రాప్ అయ్యాడనే ప్రచారాన్ని అభిమానులు అస్సలు తట్టుకోలేరు.

సరే తమిళంలో ఆ ఇద్దరు తలపడటం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ ఎటొచ్చి తెలుగులో వారసుడుని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారుతుంది. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, ఆదిపురుష్ లను కాదని విజయ్ బొమ్మను వేసుకునేందుకు బయ్యర్లు అంతగా ఆసక్తి చూపించరు. ముఖ్యంగా పరిమిత స్క్రీన్లు అందుబాటులో ఉండే బిసి సెంటర్స్ లో చిరంజీవి బాలకృష్ణ, ప్రభాస్ లకే ఉన్నవి సరిపోవు. అలాంటప్పుడు విజయ్ అజిత్ ల గురించి ఆలోచించడం కష్టం. ఒకవేళ దిల్ రాజు తన నెట్వర్క్ ఉపయోగించి వేసుకున్నా జనం ప్రాధాన్యం ఇవ్వాలిగా.

ఆదిపురుష్ తప్పుకుంటుదన్న ప్రచారం జరుగుతోంది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలేమీ కనిపించడం లేదు. దిల్ రాజుకి వారసుడు చాలా ప్రతిష్టాత్మకం. అందుకే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని కూడా గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసుకున్నారు. తీరా చూస్తే మైత్రి మూవీ మేకర్స్ ఒకేసారి వీరయ్య వీరసింహలను బరిలో దించుతుండటం చిక్కు తెచ్చి పెట్టింది. వాటి నైజామ్ హక్కుల కోసం రాజుగారు ట్రై చేశారని కానీ అంత సానుకూలస్పందన రాలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి సిచువేషన్ రానురాను జఠిలంగా మారుతోంది. మధ్యేమార్గంగ్గా ఏదైనా పరిష్కారం సూచించాలన్నా ఎవరి పట్టులో వాళ్ళుంటే అదెలా సాధ్యం.