పండగ పటాసుల్లో గెలుపు ఎవరిది

దీపావళికి వచ్చిన కొత్త సినిమాల హడావిడి పూర్తి కావొస్తోంది. రేపు శుక్రవారం చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు మళ్ళీ ఇవే ఆప్షన్లుగా మిగలనున్నాయి. మొత్తం నాలుగు బరిలో దిగితే వాటిలో విజేత ఎవరనే ఆసక్తి కలగడం సహజం. నిజానికి దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా బ్రేక్ ఈవెన్ కోణంలో కమర్షియల్ సక్సెస్ కొలుస్తారు కాబట్టి ఆ లెక్కలో చూస్తే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కార్తీ సర్దారే విన్నర్ గా మొదటి స్థానం అందుకున్నాడు. అయిదున్నర కోట్ల షేర్ ని టార్గెట్ పెట్టుకుని బరిలో దిగిన ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం ఆరు కోట్లకు దగ్గరగా ఉంది. సో లాభాలు మొదలైపోయాయి.

ఓరి దేవుడా వీకెండ్ కాగానే నెమ్మదించినప్పటికీ ఇంకో వారాంతం చేతిలో ఉంది కాబట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది లక్ష్యంగా పెట్టుకున్న ఆరు కోట్ల షేర్ లో ఇంకో కోటిన్నర వస్తే బయ్యర్లు గట్టెక్కుతారు. విశ్వక్ సేన్ బృందం అందుకే ప్రమోషన్లు ఆపకుండా కొనసాగిస్తోంది. ప్రిన్స్ మాత్రం ఏటికి ఎదురీదుతోంది. శివకార్తికేయన్ కు పెద్దగా మార్కెట్ లేనప్పటికీ ముగ్గురు అగ్ర నిర్మాతలు చేతులు కలపడం, జాతిరత్నాలు కార్డుతో దర్శకుడు అనుదీప్ ని మార్కెటింగ్ చేయడం వీక్ కంటెంట్ కి ఉపయోగపడలేదు. ఫలితంగా నాలుగు కోట్లకు పైగా నష్టం తప్పకపోవచ్చని టాక్.

ఇక జిన్నా గురించి చెప్పేందుకు ఏమీ లేదు. నాలుగు కోట్ల లోపే అమ్మినా కూడా కోటి షేర్ రాబట్టలేక పోరాడుతోంది. మంచు విష్ణు గత చిత్రాలంత డిజాస్టర్ టాక్ రాకపోయినా టీమ్ ప్రమోట్ చేసినట్టు ఢీ రేంజ్ కంటెంట్ లో సగం కూడా లేకపోవడంతో జనం దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. సో ఎలా చూసుకున్నా సర్దార్ దే దీపావళి సింహాసనం. ఈ రెస్పాన్స్ చూసే నిర్మాతలు సీక్వెల్ కి సిద్దపడిపోయారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే అక్కడితో వదిలేసేవారు కానీ ఇప్పుడు దర్శకుడు పిఎస్ మిత్రన్ విదేశాల్లో కొనసాగే గూఢచారి కథను కొనసాగించబోతున్నారు. మొత్తానికి డబ్బింగ్ సినిమాదే పైచేయి అయ్యింది.