నిఖిల్ సినిమాకు రిపేర్లు

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ రెండేళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా ‘18 పేజెస్’. కార్తికేయ-2 కంటే ముందు మొదలైన ఈ చిత్రం దాని కంటే ముందే విడుదల కావాల్సింది. జూన్‌లోనే విడుదలకు డేట్ ఇచ్చారు. ఒక దశలో డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరిగాయి.

కానీ ఏమైందో ఏమో ఈ సినిమాకు ఉన్నట్లుండి బ్రేక్ పడింది. ఆ తర్వాత నిఖిల్ దృష్టి కార్తికేయ-2 పైకి మళ్లింది. ఆ సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది కానీ.. విడుదల ఆలస్యమైనప్పటికీ అది బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది.

పాన్ ఇండియా స్థాయిలో సంచలన వసూళ్లు రాబట్టి ఏకంగా వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ చేసింది. 18 పేజెస్ ఆలస్యమైతే అయింది కానీ.. కార్తికేయ-2 కారణంగా దానికి బజ్ పెరుగుతోందని చిత్ర బృందం సంతోషించే ఉంటుంది.

కాగా త్వరలో విడుదలవుతుందనుకున్న ‘18 పేజెస్’ను ఏకంగా డిసెంబరు 23కు తీసుకెళ్లిపోయారు. అంతే కాక ఇప్పుడు కొత్తగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు అంటూ మీడియాకు అప్‌డేట్ ఇచ్చారు. ఎప్పుడో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాకు మళ్లీ షూట్ ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోంది.

సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యాక తన గురువు, ఈ సినిమాకు కథా రచయిత అయిన సుకుమార్‌కు పల్నాటి సూర్యప్రతాప్ సినిమా చూపించగా.. ఆయన కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్టులో కూడా చిన్న చిన్న మార్పులు చేసి ఈ మేరకు రీషూట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ-2’ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా ఆషామాషీగా ఉండకూడదని, సినిమా సరిగా తీసి, బాగా మార్కెట్ చేస్తే పెద్ద హిట్టయ్యే అవకాశముందని భావించే ఈ రీషూట్లు అని తెలుస్తోంది.