రజినీతో బింబిసార దర్శకుడి నెరేషన్

అరంగేట్రంలో సరైన సినిమా పడాలే కానీ.. దర్శకుల జీవితం ఒక్క రాత్రిలో మారిపోతుంటుంది. ఎన్నో ఏళ్లు కష్టపడి తొలి అవకాశాన్ని దక్కించుకున్న వాళ్లు దాన్ని సద్వినియోగం చేసుకుని హిట్ సినిమాను డెలివర్ చేస్తే తర్వాతి రోజుకు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. అందులోనూ అరంగేట్రంలోనే బ్లాక్‌బస్టర్ అందిస్తే ఆ దర్శకుడికి ఉండే డిమాండే వేరు. ప్రస్తుతం మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ ఈ స్థితిలోనే ఉన్నాడు.

చాలా ఏళ్ల ప్రయత్నం తర్వాత నందమూరి కళ్యణ్ రామ్ నిర్మించిన బింబిసారతో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ తొలి చిత్రంలో పెను సంచలనమే రేపాడు. కళ్యాణ్ రామ్ లాంటి ఫ్లాపుల్లో ఉన్న హీరోతో అతను ఇలాంటి భారీ చిత్రం తీసి దాన్ని సూపర్ సక్సెస్ చేయడం అందరినీ మెప్పించింది. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో అది ఒకటి. పెట్టుబడి మీద రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టిందా చిత్రం.

దీని తర్వాత ‘బింబిసార-2’ కోసం సిద్ధమవుతున్న వశిష్ఠ్ ఈ లోపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఒక కథ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండటం విశేషం. బింబిసార గురించి తెలుసుకున్న రజినీ.. తనకు కథ చెప్పాలని ఆశించిన వశిష్ఠకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. రజినీ కోసం మరో ఫాంటసీ కథనే అతను చెప్పాడని అంటున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన రజినీ.. బింబిసార తరహా ఫాంటసీ కథలో నటిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది.

ఐతే ఒకప్పుడు తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రజినీ.. కబాలి దగ్గర్నుంచి గాడి తప్పాడు. తన స్థాయికి, శైలికి తగని కథలతో సినిమాలు చేసి మార్కెట్, క్రేజ్ చాలా వరకు దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడాయన నెల్సన్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. 70 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న రజినీని వశిష్ఠ మెప్పిస్తే అతడి కెరీర్ ఒకేసారి పెద్ద రేంజికి వెళ్లిపోవడం ఖాయం.