దీపావళికి సంక్రాంతి క్లారిటీ

తెలుగు సినిమాలకు సంబంధించి అతి పెద్ద సీజన్ అంటే సంక్రాంతినే. వారం వ్యవధిలో మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతాయి. అందులో కనీసం రెండు పెద్ద చిత్రాలుంటాయి. మిగతా ఏ టైంలోనూ లేని విధంగా సంక్రాంతికి జనం థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తారు. వసూళ్లు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ పండక్కి సినిమాలు రిలీజ్ చేయడానికి గట్టి పోటీ ఉంటుంది. 2023 సంక్రాంతి సినిమాల విషయంలో ఇటీవల చాలా గందరగోళం నడుస్తోంది.

ముందు ఈ పండక్కి అనుకున్న రామ్ చరణ్-శంకర్ సినిమా, హరిహర వీరమల్లు వాయిదా పడిపోయాయి. తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రంతో పాటు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ రేసులోకి వచ్చాయి. వీటితో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు సైతం సంక్రాంతి బరిలోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇవన్నీ అదే రిలీజ్‌కు కట్టుబడి ఉన్నాయి.

కానీ ఈ మూడు చిత్రాలకు సంబంధించి వేర్వేరుగా వాయిదా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆదిపురుష్ కు సంబంధించి వీఎఫెక్స్ వర్క్ మళ్లీ చేస్తున్నారని, సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు. చిరంజీవి సినిమాను సంక్రాంతి టైంకి రెడీ చేయడం కష్టమన్నట్లుగా వార్తలొచ్చాయి. ఇంకోవైపు వారసుడు సినిమాకు సంబంధించి చాన్నాళ్లుగా ఏ అప్‌డేట్ లేకపోవడంతో ఆ చిత్రం నిజంగా సంక్రాంతికి వస్తుందా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. కొత్తగా నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ సంక్రాంతి రేసులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ మొత్తం ఐదు సినిమాల్లో మహా అయితే మూడు సినిమాలు మాత్రమే రిలీజవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంతకుమించితే థియేటర్ల సర్దుబాటు కష్టం. అందరికీ నష్టం జరుగుతుంది. మరి పక్కాగా సంక్రాంతికి వచ్చేది ఎవరు అన్న స్పష్టత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ఐతే దీపావళి రోజు ఈ విషయంపై ఒక క్లారిటీ రావచ్చని భావిస్తున్నారు. చిరు, బాలయ్య సినిమాలకు సంబంధించి ఆ రోజు టైటిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. దాంతో పాటే రిలీజ్ డేట్ కన్ఫమ్ కావచ్చు. దీపావళి సందర్బంగా ఆదిపురుష్ టీం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసే స్కోప్ ఉంది. వారసుడు టీం కూడా దీపావళికి కచ్చితంగా అప్‌డేట్ ఇస్తుందంటున్నారు. వీటి సంగతి తేలాక దాన్ని బట్టి ఏజెంట్ రిలీజ్ విషయంలోనూ టీం ఒక నిర్ణయానికి రావచ్చు. ప్రకటన చేయొచ్చు.