ఆచార్య గాయాలకు మందు వేశారట

నూటా యాభై సినిమాల సుదీర్ఘ కెరీర్లో చిరంజీవి చూడని బ్లాక్ బస్టర్లు లేవు ఫ్లాపులు లేవు. వాటికెప్పుడూ ఆయన విపరీతంగా స్పందించిన దాఖలాలు లేవు. అయినా కూడా ఆచార్య డిజాస్టర్ మాత్రం బాగా డిస్టర్బ్ చేసినట్టు గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ కు ముందు నుంచి సక్సెస్ మీట్ వరకు పలు సందర్భాల్లో ఏదో ఒక రూపంలో బయట పడుతూనే ఉంది. ఇవాళ ప్రింట్ మీడియాతో ప్రత్యేకంగా జరిపిన ముఖాముఖీలో సైతం దీని ప్రస్తావన తేకుండా ఉండలేకపోయారు. ముఖ్యంగా తనది ప్లస్ రామ్ చరణ్ రెమ్యునరేషన్లు ఎనభై శాతం వెనక్కు ఇచ్చామని చెప్పడం ద్వారా ఓ పెద్ద గాసిప్ కి చెక్ పెట్టారు.

ఈ వార్త నెలల క్రితమే బయటికి వచ్చినప్పటికీ నిజమా కాదా అనే నిర్ధారణ కానీ ఆధారం కానీ ఎక్కడా లేదు. ధైర్యం చేసి ఎవరూ చిరంజీవిని ఆడకలేకపోయారు. చివరికి మెగాస్టారే ఓపెనవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ స్క్రిప్ట్ ని ఆయన దర్శకత్వాన్ని నమ్మేసి చేసుకుంటూ పోయాం తప్ప ఇందులో స్వయంకృతాపరాధం ఏమీ లేదన్నట్టుగా ఆమధ్య చిరు అన్న మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గాడ్ ఫాదర్ సక్సెస్ లో టీమ్ ఎఫర్ట్ ఉందని చెప్పి ఆచార్యకు మాత్రం డైరెక్టర్ అడిగింది చేశామని చెప్పడాన్ని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మెటీరియల్ గా వాడుకున్నారు.

ఇప్పటికైనా ఆచార్య గాయాలకు ప్రచారాలకు బ్రేక్ పడినట్టే అనుకోవాలి. కొరటాల శివ ఎలాగూ బయటికి రావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు మొదలుపెట్టే దాకా మీడియాకు దొరకడం అసాధ్యమే. ఇప్పుడు చిరు స్వయంగా అన్ని విషయాలు బయటపెట్టారు కాబట్టి భవిష్యత్తులో కొరటాల వాటిని ఖండించడమో తప్పని చెప్పడమో చేయకపోవచ్చు. ఇప్పుడు తన ధ్యాసంతా ఎన్టీఆర్ 30 మీదే ఉంది. ఇప్పటికే బోలెడు ఆలస్యం జరిగింది. మొత్తానికి గాడ్ ఫాదర్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న చిరు ఎన్నడూ లేని రీతిలో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో విపరీతంగా పాల్గొనడం గమనార్హం.