ఎన్వీ ప్రసాద్ చెప్పిన ప్రజారాజ్యం సీక్రెట్

‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థ తెలుగులో నిర్మించే చిత్రాలకు సంబంధించిన పర్యవేక్షణ అంతా చూసుకునే టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కు రాజకీయాలతో కూడా మంచి కనెక్షనే ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత ప్రజారాజ్యంలో పని చేశారు. ఆ తర్వాత జనసేనకూ తన వంతు సహకారం అందిస్తున్నాడు. చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి వీర విధేయుడైన ఆయన.. తరచుగా ఆ ఫ్యామిలీ హీరోలతో సినిమాలు తీస్తుంటారు.

రామ్ చరణ్‌తో ‘రచ్చ’ తీసి మంచి ఫలితాన్నందుకున్న ఎన్వీ ప్రసాద్.. ఇప్పుడు చిరుతో ‘గాడ్ ఫాదర్’ సినిమాను నిర్మించి సక్సెస్ కొట్టారు. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో ఆయన సినిమా సంగతి పక్కన పెట్టి ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడారు. చిరు పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్‌ను బయటపెట్టారు ఎన్వీ ప్రసాద్.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా చిరు అమ్ముడుబోయారంటూ ఆయన మీద అందరూ నానా రకాలుగా నిందలు వేశారని.. కానీ చిరు అప్పట్లో మద్రాస్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉన్న కృష్ణా గార్డెన్స్ అనే ఖరీదైన తన ప్రాపర్టీని అమ్మి ఆ పార్టీ కోసం చేసిన అప్పులన్నీ క్లియర్ చేశారని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదని, చిరు కూడా చెప్పుకోలేదని, తన లాంటి వాళ్లకే ఈ విషయం తెలుసని, చిరు గురించి ఇప్పటికీ రకరకాలుగా మాట్లాడుతుండడం చూసే ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తనను ఎన్ని రకాలుగా విమర్శంచినా పట్టించుకోరని, కానీ చిరంజీవిని ఏమైనా అంటే రోడ్డు మీదికి వచ్చేస్తారని.. ప్రజారాజ్యం తాలూకు బాధ, కోపం నుంచే ‘జనసేన’ పుట్టిందని ఎన్వీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో తనను టార్గెట్ చేసేవారితో కూడా చిరు మర్యాదగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నట్లుగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడారు. చిరు అందరినీ గౌరవిస్తారు, దండం పెడతారని.. కానీ ఇకపై ఇలాంటివి విడిచిపెట్టి అవతలి వాళ్లకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా జగన్ ముందు చిరు చేతులు జోడించిన విషయాన్ని ప్రస్తావించారు ఎన్వీ ప్రసాద్. జనసేనకు రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్‌ను, వైకాపాను టార్గెట్ చేయక తప్పదని ఎన్వీ ప్రసాద్ సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు.