నేనేమీ హర్టవ్వలేదు -దేవిశ్రీ ప్రసాద్

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్‌కు బాలీవుడ్లో ఇంత కాలం సరైన అవకాశాలు రాలేదా లేక వచ్చిన వాటిని అతను తిరస్కరించాడా అన్నది తెలియదు కానీ.. అక్కడ ఇంకా అతను తనదైన ముద్ర వేయలేదు. ‘రెడీ’ రీమేక్ లాంటి చిత్రాల్లో ఒకటీ అరా పాటలతో తప్పితే దేవిశ్రీ పేరు అక్కడ పెద్దగా వినిపించలేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి అతను బాలీవుడ్లో బిజీ అవుతున్నాడు.

సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’తో పాటు దృశ్యం-2, సర్కస్ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అందరి దృష్టీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ మీదే ఉంది. ఈ సినిమాతో దేవి బాలీవుడ్లోకి ఫుల్ లెంగ్త్ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. ఐతే ముందు ఈ చిత్రానికి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిని ప్రకటించారు. కానీ తర్వాత వేరే సంగీత దర్శకులు కూడా పాటలను పంచుకున్నారు.

బాలీవుడ్లో ఒకే సినిమాకు నాలుగురైదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక్కో పాట ఇవ్వడం.. నేపథ్య సంగీతం ఇంకొకరితో చేయించుకోవడం మామూలే. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ విషయంలో ముందు దేవినే సంగీత దర్శకుడిగా ప్రకటించి.. తర్వాత ఎందుకు ఆలోచన మార్చుకున్నారన్నది అర్థం కాలేదు. పైగా దేవితో కొన్ని పాటలు చేయించి చివరికి ఒక్క పాటే సినిమాలో పెడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ విషయంలో దేవి బాగా హర్టయ్యాడని వార్తలు వచ్చాయి.

దీనిపై దేవిశ్రీ స్పందించాడు. “నన్ను సంప్రదించేసరికే ఈ చిత్ర బృందం కొన్ని పాటలను రికార్డు చేయించుకుంది. దర్శకుడు ఫర్హద్ సామ్జీ స్క్రిప్టు వినిపించి తనకు కావాల్సిన పాటలు ఇవ్వాలని కోరాడు. నేను పాటలు ఇచ్చాను. ఐతే సినిమా పాటలు ఎక్కువైపోయి నిడివి పెరిగిపోతుండడం వాటిని తగ్గించాల్సి వచ్చింది. అదే విషయం నాకు చెప్పారు. ఇందులో నేను బాధపడడానికి ఏమీ లేదు. నేను సల్మాన్ కోసం ఒక క్రేజీ సాంగ్ కంపోజ్ చేశా. అది అభిమానులకు బాగా నచ్చుతుంది” అని దేవి క్లారిటీ ఇచ్చాడు.