ఆదిపురుష్‌ విమ‌ర్శ‌ల‌పై దిల్ రాజు స్ట్రాంగ్ కౌంట‌ర్

గ‌త నాలుగైదు రోజుల నుంచి దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ ఆదిపురుష్ మూవీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. జ‌నాలు ఏదో ఊహించుకుంటే ఇంకేదో చూపించాడు ద‌ర్శ‌కుడు ఓం రౌత్.

ముఖ్యంగా ఇదొక యానిమేష‌న్ మూవీలాగా క‌నిపించ‌డం మెజారిటీ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. అందులోని విజువ‌ల్ ఎఫెక్ట్స్.. రావ‌ణుడి పాత్ర‌ను ప్రెజెంట్ చేసిన విధానం జ‌నాల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు ఈ నేప‌థ్యంలో టీజ‌ర్, సినిమా మీద విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది.ఐతే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా గురువారం ఆదిపురుష్ టీం హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ప్ర‌త్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అక్క‌డే ఆదిపురుష్ త్రీడీ టీజ‌ర్‌ను మీడియా వారికి ప్ర‌ద‌ర్శించింది. త్రీడీలో టీజ‌ర్ చాలా బెట‌ర్‌గా ఉంద‌న్న ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది.

కాగా ఈ కార్య‌క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. ఆదిపురుష్ టీజ‌ర్ మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న కొంచెం ఘాటుగానే స్పందించారు. బాహుబ‌లిః ది బిగినింగ్ రిలీజైన‌పుడు కూడా దాని మీద విమ‌ర్శ‌లు వచ్చాయ‌ని, ట్రోలింగ్ జ‌రిగింద‌ని.. కానీ ఆ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిందని దిల్ రాజు గుర్తు చేశాడు. అలాగే కొన్ని రోజుల ముందు విడుద‌లైన పొన్నియ‌న్ సెల్వ‌న్ మీద కూడా ఇలాగే ట్రోలింగ్ చేశార‌ని.. కానీ ఆ చిత్రం త‌మిళ‌నాట రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ సాగుతోంద‌ని దిల్ రాజు అన్నాడు.

ఆదిపురుష్ సినిమాను కూడా ఇలాగే ట్రోల్ చేస్తున్నార‌ని.. ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ అద్భుతాలు చేస్తుందని రాజు ధీమా వ్య‌క్తం చేశాడు. కొంత‌మందికి ఏదీ న‌చ్చ‌ద‌ని, ప్ర‌తిదాన్నీ విమ‌ర్శిస్తార‌ని, ఆదిపురుష్ టీజ‌ర్‌ను కూడా అలాగే ట్రోల్ చేశార‌ని రాజు అన్నాడు. తాను ఆదిపురుష్ టీజ‌ర్‌ను మొబైల్లో, టీవీల్లో చూసిన‌పుడు న‌చ్చింద‌ని.. ఇప్పుడు త్రీడీలో పెద్ద స్క్రీన్ మీద చూసి విజిల్స్ కొట్టాన‌ని.. ఇలాంటి సినిమాల‌ను పెద్ద తెర‌ల మీదే చూసి ఆస్వాదించాల‌ని దిల్ రాజు అభిప్రాయ‌ప‌డ్డాడు.