మృణాల్ ఆత్మహత్య చేసుకుందామనుకుని..


మృణాల్ ఠాకూర్.. గత రెండు నెలలుగా మార్మోగుతున్న పేరు ఇది. ఈ మరాఠా అమ్మాయిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారంటే.. ‘సీతారామం’ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ఆమెను సీతా అనే సంబోధిస్తున్నారు. మృణాల్‌తో, తను పోషించిన పాత్రతో మన ప్రేక్షకులకు ఎంత ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడిందంటే.. ఆమె ఆ తర్వాత హాట్ హాట్‌గా ఫోటో షూట్లు చేస్తే వాటి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎప్పటికీ సీత పాత్రలో కనిపించినట్లే హుందాగా, సంప్రదాయ బద్ధంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక కథానాయికను తెలుగు ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆరాధించడం అరుదనే చెప్పాలి.

‘సీతారామం’ చూశాక మృణాల్ ఇంతకుముందు చేసిన సినిమాలను చూస్తూ.. తన వ్యక్తిగత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ క్రమంలోనే మృణాల్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

యుక్త వయసులో తాను మీడియాలోకి రావాలనుకున్నానని.. తన తల్లిదండ్రులను ఒప్పించి మీడియా కోర్సులో్ చేరినట్లు మృణాల్ తెలిపింది. ఐతే బ్యాంకు ఉద్యోగి అయిన తన తండ్రి ముంబయి నుంచి వేరే చోటికి బదిలీ అవ్వడంతో తాను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయానని.. అప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నానన్న బాధ, మీడియా తనకు కరెక్ట్ కాదేమో అన్న సందిగ్ధత వల్ల తాను ఒకరకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయానని మృణాల్ వెల్లడించింది. ఒక రోజు లోకల్ ట్రైైన్లో నుంచి కిందికి దూకేసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని.. ఐతే అలా చేస్తే తన తల్లిదండ్రులు పడే బాధ గురించి ఆలోచించి వెనక్కి తగ్గానని.. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలనిపించి ముందుగా మోడలింగ్‌లో అడుగు పెట్టానని.. ఆపై సీరియళ్లలో అవకాశం వచ్చిందని మృణాల్ తెలిపింది.

ఐతే సీరియళ్లలో చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం వెళ్తే చాలా తక్కువగా చూసేవారని, అవమానించేవారని.. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నాలు చేశానని మృణాల్ తెలిపింది. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని.. చివరికి ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు బ్రేక్ వచ్చిందని.. ఆపై సూపర్ 30, తూఫాన్, ధమాకా, జెర్సీ లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. మెల్‌బోర్న్‌లో ఒకసారి ‘లవ్ సోనియా’ సినిమాను ప్రదర్శించినపుడు నాగ్ అశ్విన్‌తో పరిచయం అయిందని.. అదే తన కెరీర్లో పెద్ద మలుపు అని.. ఆయన ద్వారానే ‘సీతారామం’ లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కిందని మృణాల్ చెప్పింది.