ప్ర‌వీణ్ స‌త్తారు కెరీర్లో తొలిసారి..


ఎల్బీడ‌బ్ల్యూ, రొటీన్ ల‌వ్ స్టోరీ, చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్‌, గ‌రుడ‌వేగ.. యువ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఇప్ప‌టిదాకా రూపొందించిన చిత్రాలివి. వీటిలో ఒక సినిమాకు ఇంకో సినిమాకు అస‌లు సంబంధ‌మే ఉండ‌దు. ప్ర‌తిసారీ ఒక కొత్త క‌థ‌తో అత‌ను ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే వ‌చ్చాడు. అన్నింట్లోకి చివ‌ర‌గా అత‌ను తీసిన గ‌రుడ‌వేగ త‌న‌కు ఎక్కువ ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌వీణ్ మీద అంచ‌నాలు బాగా పెరిగాయి. కాక‌పోతే అనుకోని కార‌ణాల‌తో కెరీర్లో గ్యాప్ వ‌చ్చింది.

ఇప్పుడ‌త‌ను అక్కినేని నాగార్జున హీరోగా రూపొందించిన ది ఘోస్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ది ఘోస్ట్ విశేషాల‌ను అత‌ను పంచుకున్నాడు. త‌న కెరీర్లో ఎన్న‌డూ చేయ‌నిది ఈ సినిమాకు చేసిన‌ట్లు ప్ర‌వీణ్ వెల్ల‌డించాడు.

ఇప్ప‌టిదాకా క‌థ‌లు రాసి అందుకు త‌గ్గ హీరోల‌ను ఎంచుకున్నాన‌ని.. కానీ ది ఘోస్ట్‌కు మాత్రం నాగార్జున‌ను దృష్టిలో ఉంచుకునే క‌థ రాశాన‌ని ప్ర‌వీణ్ వెల్ల‌డించాడు. తాను ముందు నాగార్జ‌న‌ను క‌లిసిన‌పుడు ఏదైనా కొత్త‌గా చేద్దాం అని చెప్పార‌ని.. ఆ త‌ర్వాత ఈ క‌థ రాసి ముందుగా నిర్మాత‌లు శ‌ర‌త్ మ‌రార్, సునీల్ నారంగ్‌ల‌ను క‌లిసి క‌థ చెప్పాన‌ని.. వాళ్ల‌కు న‌చ్చాక నాగ్‌ను అప్రోచ్ అయ్యాన‌ని ప్ర‌వీణ్ తెలిపాడు.

నాగార్జున అంటే త‌న మ‌న‌సులో ప్ర‌త్యేక ఇమేజ్‌ ఉంద‌ని.. దాన్ని దృష్టిలో ఉంచుకుని స్టైల్, ఇంటెన్సిటీ, గ్రేస్‌కు త‌గ్గ‌ట్లుగా ది ఘోస్ట్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన‌ట్లు ప్ర‌వీణ్ వెల్ల‌డించాడు. అభిమానులు నాగ్‌ను ఎలా చూడాల‌నుకుంటారో అలా ఇందులో క‌నిపిస్తాడ‌ని, ఆయ‌న కెరీర్లోనే ఇది మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో ఒక‌ట‌ని అత‌ను చెప్పాడు. వ‌రుణ్ తేజ్‌తో త‌న త‌ర్వాతి సినిమా ఈ నెల 10న యూకేలో మొద‌ల‌వుతుంద‌ని చెప్పిన ప్ర‌వీణ్‌.. దీని త‌ర్వాత తాను ఒక వెబ్ సిరీస్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.