65 లక్షల సినిమా ప్రేమికుల స్ఫూర్తి

సెప్టెంబర్ 23 నేషనల్ సినిమా డే మాములు బ్లాక్ బస్టర్ కాలేదు. కేవలం 75 రూపాయలకే మల్టీ ప్లెక్స్ టికెట్ ని సొంతం చేసుకుని కొత్త పాత తేడా లేకుండా ఏ మూవీ అయినా చూసే ఛాన్స్ దొరకడంతో కొందరు ఏకంగా రెండు మూడు షోలు వరసగా కొట్టేశారు. ఈ ఆఫర్ గవర్నమెంట్ జీవోలు, లైసెన్సింగ్ విధానాల వల్ల తెలంగాణ, ఏపి లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో వర్తించనప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం జనాలు థియేటర్లను హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడేలా చేసారు. ఒక్కరోజే 65 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిష్టంగా 112 రూపాయలు పెట్టడం కొంతలో కొంత హెల్ప్ అయ్యింది. టాక్ తో సంబంధం లేకుండా అల్లూరి, కృష్ణ వృంద విహారి, దొంగలున్నారు జాగ్రత్తలను చూసేందుకు ప్రేక్షకులు టికెట్లు కొన్నారు. ఇక్కడే ఒక స్ఫూర్తివంతమైన పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జనాల్లో వెండితెర మీద ప్రేమ చెక్కుచెదరలేదు. కుటుంబంతో సహా వచ్చి చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళను ఆపుతున్నది అధిక టికెట్ రేట్లు, టికెట్ల కన్నా ఎక్కువగా దోపిడీ చేస్తున్న క్యాంటీన్ లోని పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి తినుబండారాల ధరలు.

నిజంగా తగ్గిస్తే ఎలా ఉంటుందో కళ్ళముందు కనిపిస్తోంది. పెద్దగా బజ్ లేని చుప్, ధోకా డి కార్నర్ లాంటి బాలీవుడ్ మూవీస్ కి టికెట్లు దొరకలేదంటే పబ్లిక్ ఎంతగా ఈ స్కీం కి కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని మల్టీ ప్లెక్సుల్లో పాప్ కార్న్ కోక్ లాంటివి కలిపి వంద రూపాయలకే ఇవ్వడం పట్ల నెటిజెన్లు సంతోషాన్ని వ్యక్తం చేయడం ట్వీట్ల రూపంలో కనిపించింది. ఇలాంటి డేలు ఏడాదికి ఒకటి కాదు నెలకు కొన్ని కావాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్ కు ఇంకా ఎక్కువగా అలవాటు పడతారు. కొత్త రిలీజులకు అక్కర్లేదు. రెండో వారంపైబడి ఉన్నవాటికి ఇలాంటి పథకాలు తీసుకొస్తే ఇటు బయ్యర్లు అటు ప్రేక్షకులు ఇద్దరూ హ్యాపీ.