బన్నీ అభిమానులకు డబుల్ బొనాంజా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఒకేసారి డబుల్ గుడ్ న్యూస్ లు అందబోతున్నాయి. అక్టోబర్ 1న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్మించిన అల్లు స్టూడియోస్ ని ప్రారంభించడంతో పాటు అందులోనే పుష్ప 2 ది రూల్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకొద్ది రోజుల్లో రానుంది. ఇప్పటిదాకా భాగ్యనగరంలో సినిమాల పరంగా అందుబాటులో ఉన్నపెద్ద స్టూడియోల్లో రామానాయుడు, అన్నపూర్ణ, సారథిలు ప్రధానమైనవి. వాటి సరసన ఇప్పుడీ అల్లు స్టూడియోస్ చేరబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇప్పటిదాకా దాని తాలూకు విజువల్స్ కానీ ఫోటోలు కానీ ఏవీ బయటికి రాలేదు. మొత్తం పూర్తి చేశారా లేక కొంత భాగంతోనే ప్రస్తుతానికి చిత్రీకరణలు స్టార్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 2 సంగతి చూస్తే మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ లో వచ్చింది. ఇప్పటికి పది నెలలు గడిచిపోయాయి. నార్త్ లో ఇది బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ విషయంలో దర్శకుడు సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేసి కొత్తగా కొన్ని పాత్రలు జోడించారు. బన్నీ కూడా ఎలాంటి ఒత్తిడి చేయకుండా వెయిట్ చేస్తూనే వచ్చాడు.

దానికి తగ్గట్టుగానే పుష్ప 2 ఫైనల్ వెర్షన్ సిద్ధమయ్యిందట. అడవికి సంబంధించిన కీలక ఎపిసోడ్లు మారేడుమిల్లిలో కాకుండా విదేశాల్లో కొంత భాగం తీయాలనే ప్లానింగ్ జరిగిందని సమాచారం. ఎక్కువ డీటెయిల్స్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నతో పాటు కీలక ఆర్టిస్టుల డేట్లు తీసుకుని షెడ్యూల్స్ ని ఫిక్స్ చేశారు. ఐటెం సాంగ్ తో సహా దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లన్నీ ఇచ్చేశారని వినికిడి. ఎంత ప్రణాళికతో చేసినా 2023 చివరిలోనే పుష్ప 2 వచ్చే అవకాశముంది. ఒకవేళ అప్పుడు మిస్ అయితే 2024 సంక్రాంతికే. బడ్జెట్ కూడా మూడు వందల కోట్లని ఇన్ సైడ్ టాక్.