ఆమెకు అడివి శేష్ క్ష‌మాప‌ణ‌

టాలీవుడ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే న‌టుల్లో అడివి శేష్ ఒక‌డు. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్నా.. సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నా కొంచెం కూడా గ‌ర్వం త‌లకు ఎక్కించుకోలేద‌త‌ను. కొన్ని నెల‌ల కింద‌టే మేజ‌ర్ మూవీతో అత‌ను ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలిసిందే. స్టేజ్ ఎక్కితే చాలా విన‌మ్రంగా మాట్లాడే అత‌ను.. మేజ‌ర్ స‌క్సెస్ త‌ర్వాత కూడా అదే ధోర‌ణి కొన‌సాగిస్తున్నాడు.

తాజాగా శేష్.. రెజీనా క‌సాండ్రా-నివేథా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన శాకిని డాకిని మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథుల్లో ఒక‌డిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా అత‌ను మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత సునీత తాటికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇందుకు కార‌ణ‌మేంటో కూడా వివ‌రించాడు.

మేజ‌ర్ మూవీ సునీత తాటి కూడా ఒక పాత్ర చేసింద‌ట‌. ఇందులో శోభిత దూళిపాళ్ల త‌ల్లిగా సునీత న‌టించింద‌ట‌. ముంబ‌యి తాజ్ హోట‌ల్లో ఉగ్ర‌దాడి సంద‌ర్భంగా చిక్కుకుపోయిన బాధితుల్లో ఒక‌రిగా శోభిత న‌టించింది. ఉగ్రవాదులు తాజ్ హోట‌ల్లో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేస్తున్న స‌మ‌యంలో శోభ‌తి ఫోన్లో త‌న ఇంట్లో వాళ్ల‌తో మాట్లాడుతూ క‌నిపిస్తుంది. ఆ స‌న్నివేశాల్లో అవ‌త‌లి నుంచి శోభిత త‌ల్లిగా సునీత క‌నిపించాల్సింద‌ట‌. ఆ మేర‌కు స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించార‌ట‌. కానీ త‌ర్వాత నిడివి ఎక్కువ అయిపోయింద‌ని భావించి సునీత న‌టించిన స‌న్నివేశాల‌న్నింటినీ తీసేయాల్సి వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యం చెబుతూ సునీతకు సారీ చెప్పాడు శేష్.

ఈ సంద‌ర్భంగా అదేం పెద్ద విష‌యం కాద‌న్న‌ట్లుగా స్పందించింది సునీత‌. ఆమె సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి శాకిని డాకిని మూవీని నిర్మించింది. ఇంత‌కుముందు ఈ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఓ బేబీ సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే.