ప్రభాస్ ఈవెంట్లే బ్రేక్ వేశాయి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తారక్ ఫ్యాన్స్ ని బాగా కలవరపరిచింది. బింబిసార తర్వాత తను పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తున్న వేడుక ఇదే కావడంతో భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తీరా చూస్తే సెక్యూరిటీని కారణంగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దానికి సంబంధించిన వివరణ పాయింట్ల వారిగా ఇస్తూ తామెందుకు పర్మిషన్ ని తిరస్కరించామో వివరించారు. ఆ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అందులో పోలీస్ శాఖ ప్రధానంగా గతంలో జరిగిన రెండు ఈవెంట్ల గురించి ప్రస్తావించింది. 2021లో రాధే శ్యామ్ వేడుక ఇదే వేదిక వద్ద జరిగినప్పుడు లెక్కకు మించి పాసులు ఇచ్చారని, ఇది రాచకొండ కమీషనర్ ఆదేశాలను మీరడమేనని పేర్కొంది. అంతే కాదు సదరు కేసు తాలూకు నెంబర్లు కూడా పొందుపరిచింది. మరో ఉదాహరణ చెబుతూ సాహో ఈవెంట్ సైతం ఇక్కడే జరిగితే తండోప తండాలుగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేక డిపార్టుమెంటు పడ్డ ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఆర్గనైజర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపింది.

బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు నోటి మాటగా 10 నుంచి 12 వేల దాకా జనం వస్తారని పేర్కొన్నారని, కానీ వాటి తాలూకు పాసులు జారీ చేసే పద్దతేది తమకు స్పష్టం చేయలేదని చురకలు వేసింది. రాధే శ్యామ్ సమయంలో ఫిలిం సిటీ ఉన్న నేషనల్ హైవే 65 మీద భారీ ఎత్తున వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ జరిగిందని మరోసారి రిపీటయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పింది. గణేష్ విగ్రహాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉన్న వైనాన్ని కూడా అందులోనే చెప్పింది. మొత్తానికి కారణాలు ఎన్ని ఉన్నా బ్రహ్మాస్త్ర ఈవెంట్  క్యాన్సిలేషన్ కి ప్రభాస్ సినిమాలు పరోక్షంగా కారణం కావడం ఫైనల్ ట్విస్ట్.