ఆర్జీవీకి అదిరిపోయే ఎలివేషన్

రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ఎంత ప‌త‌నం అయిపోయాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ ఏడాది ఆయ‌న్నుంచి డేంజ‌ర‌స్‌, కొండా, అమ్మాయి అంటూ ఏవో సినిమాలు వ‌చ్చాయి. వాటిని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే సినిమాలు ఆడించ‌డానికి అయిన మెయింటైనెన్స్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాని ప‌రిస్థితి. ఇదే ద‌ర్శ‌కుడు మూడు ద‌శాబ్దాల ముందు శివ సినిమాతో రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఆ త‌ర్వాత కూడా ఒక ప‌ది ప‌దిహేనేళ్లు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.

ఇండియ‌న్ సినిమాను కొత్త పుంత‌లు తొక్కించి అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. వ‌ర్మ అండ‌తో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌తిభావంతులైన ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. వివిధ భాషల్లో గొప్ప పేరు సంపాదించాడు. అలాంటి వారిలో బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ కూడా ఒక‌డు. గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా కొన్ని క్లాసిక్స్ తీసిన ఈ ద‌ర్శ‌కుడి నుంచి తాజాగా దోబారా అనే సినిమా వ‌చ్చింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా వ‌ర్మ నుంచి తాను ఎలా ఫిలిం మేకింగ్ నేర్చుకున్న‌ది అనురాగ్ వెల్ల‌డించాడు. వ‌ర్మ ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం అంటే ఫిలిం స్కూల్‌కు వెళ్ల‌డ‌మే అని అత‌ను వ్యాఖ్యానించాడు. చాలామంది ద‌ర్శ‌కులు త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేసే అసిస్టెంట్ల విష‌యంలో ఇన్‌సెక్యూర్ ఫీల‌వుతుంటార‌ని., వాళ్ల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌ర‌ని, కానీ వ‌ర్మ అలా కాద‌ని.. ఎవ‌రు ఏ ఐడియా ఇచ్చినా తీసుకుంటార‌ని.. స‌త్య సినిమాలో క‌ల్లుమామ పాట‌ను పూర్తిగా అసిస్టెంట్ల‌కు అప్ప‌గించి వారితోనే తీయించారని అనురాగ్ వెల్ల‌డించాడు.

కెమెరామ‌న్‌కు ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది త‌లెత్తితే త‌న‌కో డిజిట‌ల్ కెమెరా ఇచ్చేసి సీన్లు చెప్పి ఎలా తీస్తావో తీయి అని చెప్పి.. అందులో న‌చ్చిన‌వి ఎంచుకుని కెమెరామ‌న్‌కు ఇన్‌పుట్స్‌గా ఇచ్చేవాడ‌ని అనురాగ్ తెలిపాడు. రాము అంత సెక్యూర్ ప‌ర్స‌న్‌ను తాను అంత వ‌ర‌కు చూడ‌లేద‌ని.. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ని చేసిన ప్ర‌తి రోజూ ఎంతో నేర్చుకున్నాన‌ని.. మూడేళ్ల పాటు ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తున్న‌ట్లే ఉండేద‌ని చెబుతూ.. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్జీవీ ఈజ్ ద బెస్ట్ అంటూ అనురాగ్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.