దిల్ రాజు చేతికి మరో భారీ సినిమా

ఇండియన్ స్క్రీన్ మీదికి రాబోతున్న మరో భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్రానికి ఆశించినంత హైప్ లేకపోవచ్చు కానీ.. ఇది ‘బాహుబలి’కి దీటుగా నిలిచే చిత్రం అవుతుందని కోలీవుడ్ ఆశిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రాన్ని రూపొందించింది దిగ్గజ దర్శకుడు మణిరత్నం. ఈ సినిమా తీయాలని ఆయన రెండు దశాబ్దాల ముందు నుంచి కలలు కంటున్నారు. తమిళ లెజెండరీ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు.

లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్నిరూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబరు 30న ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద సపోర్టే దొరికింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ‘PS-1’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నాడు.

‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ చూస్తే ఇది ఉన్నత స్థాయి సినిమాలాగే కనిపించింది కానీ.. తమిళనాడు అవతల ఈ చిత్రానికి హైప్ తీసుకురావడంలో ఆ చిత్ర బృందం ఇప్పటిదాకా ఫెయిలైంది. ఐతే ఇప్పుడు దిల్ రాజు రంగంలోకి దిగాడు కాబట్టి ఆటోమేటిగ్గా తెలుగులో బజ్ పెరగొచ్చు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటేనే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఏర్పడుతుంది. పబ్లిసిటీ గట్టిగా చేస్తారు. రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంటుంది.

ఇంతకుముందు మణిరత్నం సినిమాలు ‘ఓకే బంగారం’, ‘చెలియా’లను దిల్ రాజే రిలీజ్ చేయడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్ ఆరంభంలో ‘అమృత’ చిత్రాన్ని సైతం రాజు తెలుగులో విడుదల చేశాడు. ‘పొన్నియన్ సెల్వన్’కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విక్రమ్, కార్తి, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, ఐశ్వర్యారాయ్, మోహన్ బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.