సురేష్ బాబు నిర్ణయాలు మారాయి

సినిమాల నిర్మాణం, విడుదల విషయంలో జరిగే లావాదేవీల తాలూకు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటారని పేరున్న సురేష్ బాబు ఆ మధ్య ఓటిటి రిలీజుల గురించి తన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పడం ఇంకా గుర్తే. నష్టం రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడనని నారప్ప, దృశ్యం 2 లను డైరెక్ట్ స్ట్రీమింగ్ కు ఇవ్వడం ద్వారా రుజువు చేశారు కూడా. అయితే ఇటీవలి కాలంలో ఓటిటిలు కొత్త సినిమాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరశైలిలో మార్పులు తేవడంతో ఈయన సైతం తన స్ట్రాటజీని మార్చుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.

దానికి ఉదాహరణే తాజాగా వచ్చిన రెండు అనౌన్స్ మెంట్లు. శాకినీ డాకిని సురేష్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. ఓ కొరియన్ రీమేక్ గా తీసిన ఈ డిఫరెంట్ థ్రిల్లర్ ని ముందు నెట్ ఫ్లిక్స్ కోసమనే అనుకున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ బ్రాండ్ ఇక్కడ పని చేసింది. రెండు మూడు సందర్భాల్లో ఇదే విషయాన్నీ చెప్పారు కూడా. కానీ కొన్ని నెలల గ్యాప్ తీసుకున్నాక సడన్ గా సెప్టెంబర్ 16 థియేటర్లలో తెస్తున్నామని చెప్పేశారు. స్టార్ హీరో లేకుండా కేవలం ఇద్దరు హీరోయిన్లను నమ్ముకుని జనం హాలు దాకా వస్తారా అంటే చూడాలి.

ఇదిలా ఉండగా సింహ కోడూరి నటించిన దొంగలున్నారు జాగ్రత్తలోనూ సురేష్ బ్యానర్ పార్ట్ నర్ షిప్ ఉంది. ఇది కూడా కేవలం వారం గ్యాప్ తో సెప్టెంబర్ 23 డేట్ ఫిక్స్ చేశారు. దీనికీ మార్కెట్ పరంగా పెద్ద క్రేజ్ లేదు. పబ్లిసిటీ మెటీరియల్ ఆసక్తికరంగానే ఉంది కానీ జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది కంటెంట్ ని బట్టి ఉంటుంది. మొత్తానికి ఓటిటికి ఫిట్ అవుతాయనే ఇలాంటి సినిమాలను ఇప్పుడు వెండితెరకు తీసుకురావడం చూస్తుంటే డిజిటిల్ కంపెనీల పోకడ మారినట్టు స్పష్టంగా ఆర్థమవుతోంది. విరాట పర్వం సైతం విపరీతమైన జాప్యానికి నోచుకుని చివరికి థియేటర్లలో వచ్చినా లాభం లేకపోయింది. మరి ఈ రెండైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.