విజయేంద్ర భారీ సినిమా.. రాజమౌళి లేకుండా

ఇప్పుడు ఇండియాలో విజయేంద్ర ప్రసాద్‌ను మించిన రైటర్ లేడనడంలో అతిశయోక్తి లేడు. ఆయన్ని మించి విషయం ఉన్న రైటర్లు ఉండొచ్చు కానీ.. బాక్సాఫీస్ సక్సెస్ కోణంలో చూస్తే ఆయనే ఇండియాలో నంబర్ వన్. విజయేంద్ర విజయాల్లో రాజమౌళికి మేజర్ క్రెడిట్ వెళ్తుందన్నది వాస్తవమే కానీ.. అలా అని ఆయన పనితనాన్ని తక్కువ చేయలేదు. ఐతే కొడుకు అండ లేకుండా సక్సెస్ సాధించాలని విజయేంద్ర ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు కానీ.. అలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ.

స్వీయ దర్శకత్వంలో తీసిన సినిమాల్లో ఓ మోస్తరు విజయం సాధించినప్పటికీ.. అందులోనూ యాక్షన్ ఘట్టాల్ని రాజమౌళే చిత్రీకరించడం గమనార్హం. ఇక ఆయన కథ అందించిన చిత్రాల్లో ‘భజరంగి భాయిజాన్’, ‘మెర్శల్’, ‘మణికర్ణిక’ బాగా ఆడాయి కానీ వాటిని రూపొందించిన దర్శకులు మంచి పేరున్న వాళ్లు. ఈ నేపథ్యంలో పెద్దగా పేరు లేని దర్శకుడితో విజయేంద్ర జట్టు కట్టి తన రచనే బలంగా ఓ సక్సెస్ సాధించి చూపించడం ఆయనకు సవాలుగా మారింది.

ఇప్పుడు విజయేంద్ర ఆ సవాల్‌ను మరోసారి స్వీకరించడానికి సిద్ధమయ్యారు. 1770తో విజయేంద్ర ఓ కథ రాస్తున్నారని, త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోందని కొన్ని రోజుల కిందటే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ‘ఆకాశవాణి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అశ్విన్ గంగరాజు ఈ భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. బంకించంద్ర రాసిన ‘ఆనందమఠ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1770 ప్రాంతంలో పోరాడిన ఒక ఆశ్రమ వాసుల కథ ఇది.

దీనికి కథ, స్క్రీన్ ప్లే విజయేంద్రనే సమకూరుస్తున్నారు. రాజమౌళి బంధువే అయిన సీనియర్ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు (లిటిల్ సోల్జర్స్, ఐతే, అనుకోకుండా ఒక రోజు అమృతం ఫేమ్) తనయుడే అశ్విన్ గంగరాజు. అతను తొలి ప్రయత్నంగా ‘ఆకాశవాణి’ అనే సినిమా తీశాడు. కానీ ఓటీటీలో రిలీజైన ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ అతణ్ని నమ్మి ‘1770’ లాంటి భారీ ప్రాజెక్టును అప్పగించారు. అదంతా విజయేంద్ర రచనా బలం చూసే కావచ్చు. బహు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణకుమార్, సూరజ్ శర్మ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఇంకా నటీనటులు ఖరారవ్వలేదు. దీపావళికి దీనిపై ప్రకటన ఉంటుందట.