థియేటర్లలో 30 ఏళ్ళ ఘరానా సంచలనం

పోకిరి రీ రిలీజ్ సృష్టించిన ట్రెండ్ ఏకంగా మెగాస్టార్ అభిమానులను సైతం కదిలించింది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మొదటి పది కోట్ల గ్రాసర్ ఘరానా మొగుడుని థియేటర్లలో తీసుకురాబోతున్నారు. 1992లో విడుదలైన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒక రీమేక్ మూవీతో దర్శకేంద్రులు కె రాఘవేంద్ర చేసిన మేజిక్ కి బాక్సాఫీస్ దాసోహమంది. అందుకే ఆ మెగా మేనియాని ఇప్పటి తరానికి బిగ్ స్క్రీన్ మీద చూపించే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే సెప్టెంబర్ 2న జల్సా వేసుకునేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దానికన్నా ముందు అన్నయ్య ని రంగంలోకి దించేస్తున్నారు. ఇలా చేయడం బాగానే ఉంది కానీ వీటికీ రెగ్యులర్ గా ఉన్న టికెట్ రేట్లే పెడుతుండటంతో రాబోయే రోజుల్లో వీటికి స్థిరమైన ఆదరణ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందరూ చూసే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీ ఇచ్చే ఆలోచనలు చేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. పోకిరికి సైతం హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రెండు వందల దాకా అమ్మారు.

ఇక ఘరానా మొగుడు విషయానికి వస్తే ఒకవేళ ఇది కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే నెక్స్ట్ వరసలో శివ కూడా ప్లాన్ చేయబోతున్నారని తెలిసింది. కొన్నేళ్ల క్రితం దీన్ని రీ మాస్టర్ చేసి విడుదల చేస్తామని నాగార్జున అన్నారు కానీ ఆ మాటకు కట్టుబడలేక పోయారు. ఇప్పుడేమైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి. సరే ఈ ఉత్సాహం మెచ్చుకోదగిందే కానీ కొత్త సినిమాలకే జనం థియేటర్లకు పూర్తిగా రావడం లేదని బాధపడుతున్న టైంలో వాటికొచ్చే కలెక్షన్లను సైతం పాత బ్లాక్ బస్టర్స్ పంచేసుకుంటే ఎలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.