ప్రభాస్ అభిమానుల్లో ఆవేదన, ఆక్రోశం

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ అరుదైన చిత్రం అనడంలో సందేహం లేదు. ఇలాంటి స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథను తెలుగు తెరపై చూసి చాలా కాలం అయిపోయింది. ఇది క్లాస్ సినిమా కావడం వల్ల, పోటీగా విడుదలైన ‘బింబిసార’ మాస్‌ను బాగా ఆకర్షిస్తుండటం వల్ల వసూళ్ల విషయంలో వెనుకబడి ఉండొచ్చు కానీ.. ఇది తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

క్లాస్ లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమా చూసి మైమరిచిపోతున్నారు. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. సోషల్ మీడియా జనాలు చాలా ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు సినిమా చూసి. ఐతే ఈ స్పందన చూసి ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుండటం గమనార్హం. ఐతే వారి ఆవేదన ‘సీతారామం’ బాగుందని కాదు. వాళ్ల ఆక్రోశం ఈ చిత్ర బృందం మీదా కాదు.

కొన్ని నెలల కిందటే ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ ఎంత హైప్ మధ్య రిలీజైందో తెలిసిందే. ప్రభాస్ చాలా కాలం తర్వాత చేసిన పూర్తి స్థాయి ప్రేమకథ ఇది. ‘బాహుబలి’ తర్వాత తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. ఆ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి యాక్షన్‌కు అవకాశం లేని ‘రాధేశ్యామ్’లో నటించాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు యువి క్రియేషన్స్ అధినేతలు. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపిస్తుంది. లొకేషన్లు, సెట్టింగ్‌లు, అందులో ప్రాపర్టీస్.. ఇలా ఏం చూసుకున్నా భారీతనమే. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కూడా పెద్ద రేంజికి చెందిన వాళ్లే. రోమ్‌లో చేయాల్సిన కొన్ని సీన్లు మిగిలిపోతే.. హైదరాబాద్‌లో ఆ సిటీని తలపించే సెట్ వేసి షూట్ చేయడం విశేషం.

ఇలా గ్రాండియర్ గ్రాండియర్ అంటూ వందల కోట్లు పోసేశారు. కానీ ఈ భారీతనం ఎందుకూ కొరగాకుండా పోయింది. కంటెంట్ లేకుండా ఎంత ఖర్చు పెట్టి ఏం ప్రయోజనం? సినిమా ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. కట్ చేస్తే ఇప్పుడు ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంటోంది. ‘రాధేశ్యామ్’తో పోలిస్తే దీని బడ్జెట్ 15 శాతం కూడా లేదు. కానీ తెరపై అద్భుతమైన ఔట్ పుట్ కనిపించింది. కథాకథనాల బలంతో, అద్భుతమైన పెర్ఫామెన్స్‌లతో సినిమా ఉన్నత స్థాయిలో నిలబడింది. ఈ సినిమా చూసిన వాళ్లు ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలను మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా దాని దర్శకుడిని ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో గట్టిగా వాయించేస్తున్నారు.