‘బింబిసార’ vs ‘సీతా రామం’

ఆగస్ట్ 5న రోజు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ , దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ థియేటర్స్ లోకి వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ప్రమోషనల్ వార్ జరుగుతుంది. రెండు సినిమాలకు సంబంధించి భారీ ప్రమోషన్స్ చేసుకున్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంటర్వూస్ , టూర్స్ , ఈవెంట్స్ , ప్రెస్ మీట్స్ ఇలా రెండు సినిమాలకు సంబందించిన హీరోలు, హీరోయిన్స్ ఫుల్ బిజీ గా ఉన్నారు. కానీ ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రమోషన్స్ లో ‘సీతారామం’ ని దాటేసింది. 

కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం , తన స్పీచ్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేయడం జరిగిపోయింది. కానీ సీతా రామం మాత్రం ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోలేదు. ఇందుకు రీజన్ ప్రభాస్.  బింబిసార కోసం కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ ని రంగంలో దింపడంతో నిర్మాత అశ్వనిదత్, స్వప్న దత్ కి పెద్ద చాలెంజ్ ఎదురైంది. దీంతో తమ బేనర్ లో సినిమా చేస్తున్న బాహుబలి ప్రభాస్ ని తమ ఈవెంట్ కి రప్పించాలని అనుకున్నారు.

కానీ ప్రభాస్ చిన్న హెల్త్ ప్రాబ్లెం కారణంగా వారిని ఇన్ని రోజులు వెయిట్ చేయించాడు. ఫైనల్ గా ఇప్పుడు ఈవెంట్ కి డేట్ ఇచ్చాడు. కాకపోతే ప్రభాస్ ఒక షరతు మీద ఈవెంట్ కి రావడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. క్రౌడ్ లేకుండా సింపుల్ గా ఈవెంట్ జరపాలని, అలాగైతేనే గెస్ట్ గా వస్తానని నిర్మాతలను కోరాడట. తమ కోసం గెస్ట్ గా వచ్చి ఫ్రీ గా పబ్లిసిటీ ఇస్తానంటే ఈ మాత్రం కూడా చేయలేమా అంటూ రేపు ఈవెంట్ చిన్నగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అందుకే ఈవెంట్ ఎక్కడా అనేది గోప్యంగా ఉంచనున్నారు. కేవలం మీడియాని మాత్రమే ఇన్వైట్ చేసి జర్నలిస్టులు సమక్షంలో సింపుల్ గా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక ‘బింబిసార’ కోసం ఎన్టీఆర్ వస్తే ఇప్పుడు ‘సీతా రామం’ కోసం ప్రభాస్ రంగంలోకి దిగి ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనున్నాడు. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ మీడియా ముందుకు రాలేదు. దుల్కర్ సినిమా కోసమే ఇప్పుడు వస్తున్నాడు. మరి చూడాలి ప్రభాస్ స్పీచ్ ఎలా ఉంటుందో ? ఎప్పటిలానే పొదుపుగా మాట్లాడి టీం కి ఆల్ ది బెస్ట్ చెప్తాడా ? లేదా ఇంకేదైనా మాట్లాడి స్పీచ్ అదరగొడతాడా ? వేచి చూడాలి.