కార్తికేయ‌-2లోనూ స్వాతి ఉంటుందా?

ఎనిమిదేళ్ల కింద‌ట వ‌చ్చిన కార్తికేయ సినిమాకు కొన‌సాగింపుగా ఇప్పుడు కార్తికేయ‌-2 రాబోతోంది. కార్తికేయ రిలీజై సూప‌ర్ హిట్ట‌యిన‌పుడే ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తాన‌ని ద‌ర్శ‌కుడు చందు మొండేటి సంకేతాలు ఇచ్చాడు. ఐతే వేరే క‌మిట్మెంట్ల వల్ల‌, ఏవో కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా బాగా ఆల‌స్యం అయింది.

చివ‌రికి సినిమా మొద‌లు పెట్టాక క‌రోనా కార‌ణంగా మ‌రింత ఆల‌స్యం తప్ప‌లేదు. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఆగ‌స్టు 12న థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. ఐతే ఈ సినిమా ప‌క్కా సీక్వెలా లేక ఎఫ్‌-3 త‌ర‌హా ఫ్రాంఛైజీ చిత్ర‌మా అనే సందేహాలు జ‌నాల్లో ఉన్నాయి.

సీక్వెల్ అంటే ఫ‌స్ట్ పార్ట్ ఎక్క‌డ ముగిసిందో అక్క‌డి నుంచే క‌థ కొన‌సాగుతుంది. ఫ్రాంఛైజీ సినిమా అంటే పాత్ర‌లు తీసుకుని కొత్త క‌థ‌తో తీస్తారు. ఐతే కార్తికేయ‌-2 ప‌క్కా సీక్వెల్ అని హీరో నిఖిల్ ఒక ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశాడు.

కార్తికేయ‌లో హీరో ఒక పెద్ద స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాక‌ మెడిక‌ల్ డిగ్రీ తీసుకోవ‌డంతో క‌థ ముగుస్తుంద‌ని.. ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు ఆ హీరో పీజీలో చేరి ఒక ఆసుప‌త్రిలో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో కార్తికేయ‌-2 మొద‌ల‌వుతుంద‌ని అత‌ను వెల్ల‌డించాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎదుర‌య్యే స‌వాళ్లు.. వాటిని ప‌రిష్క‌రించ‌డానికి అత‌ను చేసే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం అని నిఖిల్ తెలిపాడు.

కాగా ఇది సీక్వెల్ అయిన‌పుడు ఫ‌స్ట్ పార్ట్‌లో నిఖిల్‌కు జోడీగా న‌టించిన స్వాతి పాత్ర సంగ‌తేంటి అనే ప్ర‌శ్న ఎదుర‌వ‌గా.. దానికి న‌ర్మ‌గ‌ర్భ‌మైన స‌మాధానం చెప్పాడు నిఖిల్. కార్తికేయ‌-2లో స్వాతి పాత్ర ప్ర‌స్తావన ఉంటుంద‌ని.. క‌థ‌లో ఆ పాత్ర కూడా భాగ‌మే అని.. ఐతే ఇందులో స్వాతి ఉందా లేదా అన్న‌ది తెర మీదే చూడాల‌ని అత‌ను చెప్పాడు.

స్వాతినే క‌థానాయిక‌గా కొన‌సాగించాల‌న్న చ‌ర్చ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఈ క‌థ తెలుగు ప్రాంతాన్ని దాటి ద్వార‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్.. ఇలా ఉత్త‌రాది రాష్ట్రాల్లో తిరుగుతుంద‌ని, అక్క‌డ హీరో క‌లిసే కొత్త అమ్మాయిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను తీసుకున్నామ‌ని నిఖిల్ వెల్ల‌డించాడు.