కొత్త విలన్ టార్చర్ పెట్టేశాడు

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ మూవీ ఏక్ విలన్ పెద్ద అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన విషయం అందరికి గుర్తే. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో రూపొంది 170 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం అప్పట్లో పెద్ద రికార్డు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా దర్శకుడు మోహిత్ సూరి సాధించిన ఈ ఫీట్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు. ఆ తర్వాత అతను ఎన్ని సినిమాలు చేసినా దీనికి వచ్చినంత పేరు రాలేకపోయింది. అందుకే మళ్ళీ దాని సీక్వెల్ తోనే హిట్టు కొట్టాలనే లక్ష్యంతో ఏక్ విలన్ రిటర్న్స్ తీశాడు.

మూడు రోజుల క్రితం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజయ్యింది. స్టార్ అట్రాక్షన్ గట్టిగానే సెట్ చేసుకున్నారు. అర్జున్ కపూర్ – జాన్ అబ్రహం – దిశా పటాని – తారా సుతారియాలతో పాటు మన శివ విలన్ జెడి చక్రవర్తి కూడా ఏసిపిగా ఓ కీలక పాత్ర చేశారు. నగరంలో లవర్స్ తో ఫస్ట్ టైం బ్రేకప్ చేసుకున్న అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. అందరికి గౌతమ్(అర్జున్ కపూర్)మీదే అనుమానం కలుగుతుంది. కానీ ఇదంతా చేస్తోంది టాక్సీ డ్రైవర్ గా పనిచేసే భైరవ్(జాన్ అబ్రహం)అని పోలీసులకు తెలియదు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. ఇంతకీ ఈ మర్డర్లు ఎందుకు జరిగాయి. వీటికి హీరోయిన్లకు కనెక్షన్ ఏంటనేది తెరమీదే చూడాలి.

పాయింట్ కొంత డిఫరెంట్ గా అనిపించినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో మోహిత్ సూరి ఫెయిలవ్వడంతో ఈ విలన్ బాగా విసిగించేస్తాడు. చీటికీ మాటికీ వచ్చే పాటలు, ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో పెట్టిన ట్విస్టులు ఏవీ వర్కౌట్ అవ్వలేదు. ఇంతా చేసి కమల్ హాసన్ ఎర్రగులాబీలతో మొదలుకుని గోపీచంద్ ఒంటరి దాకా ఎన్నో సినిమాల నుంచి స్ఫూర్తి చెందిన మోహిత్ రెండు గంటలు నిడివే ఉన్న భరించలేని కళాఖండాన్ని కానుకగా అందించాడు. షంషేరా దెబ్బకు కుదేలైన హిందీ బాక్సాఫీస్ కు ఈ విలన్ కొత్తగా జోష్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.