దిల్ రాజుకు కొత్త టెన్షన్

టాలీవుడ్లో ఇప్పుడు ఏ నిర్మాత పరిస్థితీ బాగా లేదు. పేరు మోసిన బేనర్లు.. అపార అనుభవం, మంచి జడ్జిమెంట్ ఉన్న నిర్మాతలు కూడా వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నారు. ఇందుకు దిల్ రాజు కూడా మినహాయింపు కాదు. ఆయనకు తాజాగా ‘థాంక్యూ’ రూపంలో ఆయనకు తగిలిన షాక్ అలాంటిలాంటిది కాదు. దీని కంటే ముందు దిల్ రాజు నుంచి వచ్చిన ‘ఎఫ్-3’ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. కొంత మేర నష్టాలు మిగిల్చింది. మరోవైపు హిందీలో రాజు నిర్మించిన జెర్సీ, హిట్ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురైంది.

వరుస ఫ్లాపులు, పడిపోతున్న థియేట్రికల్ రెవెన్యూ చూసి మొదలుపెట్టాల్సిన సినిమాలను ఆపాపని.. ప్రొడక్షన్లో ఉన్న చిత్రాలను కూడా హోల్డ్ చేసి రివ్యూ చేసుకుంటున్నామని దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. ఇది ‘థాంక్యూ’ రిలీజ్‌కు ముందు రాజు చెప్పిన మాట. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆయన ఆలోచన ఎంత మారి ఉంటుందో, ఇంకెంత ఆందోళన చెందుతుంటారో అర్థం చేసుకోవచ్చు.

దిల్ రాజు టెన్షన్‌ను మరింత పెంచే పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌కు ‘ఇండియన్-2’ టీం నుంచి ఒత్తిడి ఎక్కువైనట్లు చెన్నై సమాచారం. కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మొదలైన ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఎంతకీ పున:ప్రారంభం కాలేదు.

ఐతే ఇప్పుడు కమల్ హాసన్ షూటింగ్ పున:ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. నిర్మాతలు, శంకర్‌తో సైతం మాట్లాడి సర్దుబాటు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్‌తో శంకర్ సినిమా పూర్తయ్యే వరకు వాళ్లు ఎదురు చూసే పరిస్థితి లేదని.. అందుకోసం ఆ చిత్రంతో సమాంతరంగా ‘ఇండియన్-2’ షూటింగ్ కూడా చేసేలా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. గతంలో ‘ఇండియన్-2’ కథ తేల్చకుండా శంకర్ చరణ్ సినిమాను మొదలుపెట్టడంపై లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా అప్పుడు తీర్పు శంకర్‌కు అనుకూలంగానే వచ్చింది. అప్పుడే ‘ఇండియన్-2’ షూటింగ్ పున:ప్రారంభించడానికి అన్నీ సిద్ధమయ్యాక తాను అందుబాటులోకి వస్తానని శంకర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉండడంతో నెలలో కొన్ని రోజులు ఆ సినిమా కోసం కేటాయించక తప్పేలా లేదు. ఐతే శంకర్ ఫోకస్ అటు షిఫ్ట్ అయితే.. తన సినిమా ఔట్ పుట్ దెబ్బ తినొచ్చని, అలాగే రిలీజ్ కూడా ఆలస్యం కావచ్చని రాజు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.