లెజెండ‌రీ బేన‌ర్‌కు షాకుల మీద షాకులు

య‌శ్ రాజ్ ఫిలిమ్స్.. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అతి పెద్ద బేన‌ర్ల‌లో ఒక‌టి. 50 ఏళ్ల సుదీర్ఘ‌, ఘ‌న ప్ర‌స్థానం ఆ సంస్థ సొంతం. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ య‌శ్ చోప్రా ఈ సంస్థ‌ను న‌డిపిస్తే.. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు బ్యాట‌న్ అందుకున్నాడు. 23 ఏళ్ల చిన్న వ‌య‌సులో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తూ దిల్ వాలే దుల్హానియా లేజాయెంగే లాంటి ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించి సంచ‌ల‌నం రేపిన ఆదిత్య‌.. ఆ త‌ర్వాత య‌శ్ రాజ్ ఫిలిమ్స్ బాధ్య‌త‌లు తీసుకుని ఎన్నో భారీ చిత్రాల‌ను నిర్మించాడు.

తండ్రి ఘ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ సంస్థ‌ను ఇంకా పెద్ద రేంజికి తీసుకెళ్లాడు. బాలీవుడ్లో ఎక్క‌డ కొత్త టాలెంట్ క‌నిపించినా.. వాళ్ల‌తో అగ్రిమెంట్స్ చేసుకుని వ‌రుస‌గా సినిమాలు తీయ‌డం ఈ సంస్థ‌కు అల‌వాటు. ఇలా ఎన్నో సూప‌ర్ హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందించిన సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్. ధూమ‌స్ సిరీస్, ఏక్ థా టైగ‌ర్, వార్ లాంటి చిత్రాల‌తో వంద‌ల కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన సంస్థ అది.

50వ వార్షికోత్స‌వ సంబ‌రాల‌ను ఘ‌నంగా చేసుకుంటున్న ద‌శ‌లో య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. నెల కింద‌టే ఈ సంస్థ నుంచి సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రం రిలీజైంది. దాని మీద ఆ బేన‌ర్ రూ.200 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టింది. కానీ థియేట‌ర్ల‌లో ఈ చిత్రం అందులో నాలుగో వంతు క‌లెక్ష‌న్లు మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగింది.
ఇది య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఎంత పెద్ద షాకో ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? ఆ షాక్ చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు షంషేరా రూపంలో ఇంకో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది ఈ సంస్థ‌కు.

ఈ చిత్రం మీద పెట్టిన బ‌డ్జెట్ రూ.150 కోట్లు కాగా.. సినిమా తొలి రోజు కేవ‌లం రూ.10 కోట్ల నెట్ వ‌సూళ్ల‌కు ప‌రిమితం అయింది. సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో ఫుల్ ర‌న్లో 30 కోట్ల‌కు మించి వ‌సూళ్లు వ‌చ్చేలా లేవు. ఇంతేసి భారీ బ‌డ్జెట్లు పెట్టి భారీ తారాగ‌ణంతో సినిమాలు తీసిన య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇలాంటి ప‌రాభ‌వాలు ఎదుర‌వుతాయ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఇక ఆ సంస్థ ఆశ‌ల‌న్నీ ప‌ఠాన్, టైగ‌ర్-3ల మీదే ఉన్నాయి.