విక్రమ్ కష్టమంతా ‘ఎడిటింగ్’ పాలు?

కొన్ని సినిమాలకు హీరోను చూసి థియేటర్లకు వెళ్తారు ప్రేక్షకులు. కొన్ని చిత్రాలకు దర్శకుడిని చూసి వెళ్తారు. కొన్ని సినిమాల విషయంలో నిర్మాతనో, హీరోయినో కూడా ఆకర్షణగా మారొచ్చు. ‘థాంక్యూ’ సినిమా విషయానికి వస్తే.. దీనికి హీరో నాగచైతన్య ఎంత ఆకర్షణో, అదే స్థాయిలో దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఆకర్షణ అనడంలో సందేహం లేదు. స్వతహాగా ఇతను తెలుగు దర్శకుడు కాకపోయినా.. తన కెరీర్లో మరపురాని సినిమాలు తీసిందంతా తెలుగులోనే. రాజ్ కుమార్ అనే మరో దర్శకుడితో కలిసి ‘ఇష్టం’ అనే చిత్రంతో తెలుగులోనే అరంగేట్రం చేసిన విక్రమ్.. తర్వాత ‘13బి’ అనే తమిళ చిత్రంతో పాపులారిటీ సంపాదించాడు.

ఆపై చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని తెలుగులో తీసిన ‘ఇష్క్’తో అతడి దశ తిరిగిపోయింది. ఇక విక్రమ్ చేసిన ‘మనం’ అనే క్లాసిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఒక్క సినిమాతో ఎంతోమందికి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్. బహు భాషా చిత్రం ‘24’ కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. దర్శకుడిగా అతడి ముద్రను చూపించింది. ‘గ్యాంగ్ లీడర్’ ఆ స్థాయి చిత్రం కాకపోయినా… అందులోనూ కొంతమేర తన ప్రతిభను చూపించాడు. కానీ ‘థాంక్యూ’ అనే సినిమాలో మాత్రం విక్రమ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. దర్శకుడిగా ఎక్కడా తన ముద్ర అనేదే కనిపించపోవడం చాలామందిని ఆశ్చర్యం కలిగించింది.

కథ ఎంత సాధారణంగా ఉన్నప్పటికీ.. కథనంతో మ్యాజిక్ చేయడం విక్రమ్ ప్రత్యేకత. సన్నివేశాల చిత్రీకరణలో ఒక వైవిధ్యం, మంచి ఫీల్ కనిపిస్తుంటుంది. కానీ అవేవీ ‘థాంక్యూ’లో కనిపించలేదు. ఐతే చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ కాపీ కంటే ముందు దర్శకుడి ఫైనల్ కట్‌లో కొంచెం మెరుగ్గానే ఉందని.. విక్రమ్ కొన్ని సన్నివేశాలను పొయెటిగ్గా, మంచి ఫీల్‌తో తీశాడని.. ముందు అనుకున్న నిడివితో ఉంటే సినిమా ప్రేక్షకులకు కలిగించే అనుభూతి వేరుగా ఉండేదని అంటున్నారు.

‘అంటే సుందరానికీ’ లాంటి చిత్రాలకు నిడివి పెద్ద సమస్య అయిందన్న ఉద్దేశంతో ఎడిటింగ్ పరంగా నిర్మాత దిల్ రాజు కఠినంగా వ్యవహరించారని.. దీంతో చాలా సన్నివేశాలు లేచిపోయాయని.. చైతూ-రాశి మధ్య మంచి సీన్లకు కోత పడడంతో చివర్లో ఫీల్ పూర్తిగా మిస్ అయిందని.. హడావుడిగా ముగించినట్లు అనిపించిందని.. కాలేజ్ ఎపిసోడ్‌ను తగ్గించి ఈ సన్నివేశాలు పెంచి ఉంటే సినిమా ఇంత పేలవంగా ఉండేది కాదని వారంటున్నారు.