వర్మకు నిజంగా అంత ధైర్యముందా?

రామ్ గోపాల్ వర్మ సినిమాల పట్ల పూర్తిగా జనాలకు ఆసక్తి తగ్గిపోయినా.. ఆయన మాత్రం ఫిలిం మేకింగ్ ఆపట్లేదు. ఎలా నిర్మాతలను సంపాదిస్తున్నాడు.. ఆర్టిస్టులను ఎలా ఒప్పిస్తున్నాడు అన్నది చాలామందికి ప్రశ్నార్థకంగానే ఉంటున్నా.. ఒకదాని తర్వాత ఒకటి సినిమా పూర్తవుతుంటుంది. రిలీజవుతూ కూడా ఉంటుంది. కానీ ఇంతకుముందులా ఎన్ని పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులను మాత్రం థియేటర్లకు ఆకర్షించలేకపోతున్నాడు వర్మ. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఇటీవల విడుదలైన ‘అమ్మాయి’ సినిమా మెరుగని అంటున్నా సరే.. జనాలు థియేటర్ల వైపు చూడట్లేదు. వరుసగా చెత్త సినిమాలు తీయడం వల్ల వర్మ పూర్తగా క్రెడిబిలిటీ కోల్పోవడమే ఇందుక్కారణం. అయినా వర్మ పశ్చాత్తాప భావనలేమీ కనిపించవు. సినిమాలు ఆపడు.

తాజాగా ఆయన ‘కొవిడ్ ఫైల్స్’ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. కొవిడ్ టైంలో జనాలు ఎంతగా అల్లాడిపోయారో, వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులెవరో ఈ సినిమా ద్వారా చూపిస్తా అంటూ వర్మ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కొవిడ్ టైంలో విలయానికి సూచికలుగా నిలిచిన కొన్ని ఫొటోలను వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఈ సినిమా గురించి వివరించే ప్రయత్నం చేశాడు.

ఢిల్లీలో ఒకే చోట కొవిడ్‌తో మృతితో చెందిన వారి మృతదేహాలను దహనం చేస్తున్న ఫొటో.. అలాగే శానిటైజేషన్లో భాగంగా కూలీల మీద రసాయనాలు కలిపిన నీటిని కొడుతున్న ఫొటో.. ఇలా కొవిడ్ టైంలో దయనీయంగా కనిపించిన ఫొటోలను వర్మ షేర్ చేశాడు. ఈ ఫొటోలు ప్రభుత్వాల ఘోర వైఫల్యాన్ని సూచించేవే. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు ఈ ఫొటోలు ఎంత చెడ్డపేరు తెచ్చాయో అందరికీ తెలుసు. వీటిని షేర్ చేస్తూ కొవిడ్ పాపం ఎవరిదో తన సినిమాలో చూపిస్తానని వర్మ ప్రకటిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

వర్మ చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ చిత్రం మోడీ సర్కారుకు వ్యతిరేకంగానే ఉండాలి. నిజంగా వర్మ నిర్భయంగా సినిమా తీస్తే కచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ దక్కొచ్చు. కానీ పొలిటికల్ సినిమాలు తీసినా సాఫ్ట్ టార్గెట్ అయిన చంద్రబాబు లాంటి వారినే లక్ష్యంగా చేసుకునే వర్మ.. మోడీ, జగన్, కేసీఆర్ లాంటి వాళ్ల జోలికి వెళ్లడని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నిజంగా మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ‘కొవిడ్ ఫైల్స్’ సినిమా తీసే ధైర్యం వర్మ చేస్తాడమో చూడాలి.