సుశాంత్ కేసులో కొత్త మలుపు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి రెండు వారాలు దాటిపోయింది. అతడిది ఆత్మహత్యే అని తేల్చినప్పటికీ.. అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అతడి జీవితంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఒకప్పుడు అంకిత లోఖండెతో సీరియస్‌గా కొన్నేళ్ల పాటు రిలేషన్‌షిప్ నడిపాడు సుశాంత్. కారణాలేంటో తెలియవు కానీ ఆమె నుంచి విడిపోయాడు. సుశాంత్ ఎంతో సంతోషంగా ఉన్న రిలేషన్‌షిప్ ఇదే అంటారు. తర్వాత కృతి సనన్‌తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడంటారు కానీ.. దానిపై స్పష్టత లేదు. ఆమెతో అతను ‘రాబ్తా’ అనే సినిమా చేసినంత కాలమే ఇలాంటి వార్తలు వినిపించాయి.

ఐతే తర్వాత రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్‌గానే ప్రేమాయణం నడిపాడని.. వాళ్లిద్దరూ ఈ ఏడాది అక్టోబరులో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. రియాను పోలీసులు కొన్ని రోజుల పాటు విచారించడం కూడా తెలిసిందే. ఐతే ఆ విచారణ సందర్భంగా రియా దాచిపెట్టిన ఓ విషయాన్ని పోలీసులు తమ విచారణలో కనుగొన్నట్లు తెలుస్తోంది. రియా సోదరుడు షఓవిక్ చక్రవర్తితో కలిసి సుశాంత్ వ్యాపారం చేస్తున్నాడట. ‘వివద్రేజ్ రియాలిటిక్స్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫిర్మ్ ఏర్పాటు చేసి వీళ్లిద్దరూ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని తన స్టేట్మెంట్‌లో రియా వెల్లడించకపోవడంతో సుశాంత్ ఆత్మహత్య వెనుక ఈ వ్యాపార సంబంధిత విషయాలేమైనా ఉన్నాయేమో అన్న అనుమానంతో పోలీసులు షోవిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.