టాలీవుడ్ ఓపెనింగ్స్ కి బూస్ట్ కావాలి

ప్రతి శుక్రవారం సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. గ్రాండ్ ఓపెనింగ్స్ చూడటం అరుదైపోతోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2ల తర్వాత ఆ స్థాయిలో మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డులు చూడటం గగనమయ్యింది. సర్కారు వారి పాట, ఎఫ్3లు సైతం నైజామ్ టికెట్ రేట్ల వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డవే. ఇక రాధే శ్యామ్, ఆచార్యల గురించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది పుష్ప బాగానే వెళ్లినప్పటికీ నార్త్ అంత ప్రభావం మన సౌత్ లో కనిపించలేదు. అఖండ వీరంగం ఆడినా బాలయ్య మార్కెట్ పరిమితుల వల్ల వంద కోట్లను మించి దాటలేకపోయింది.

గతంలో కాస్త ఇమేజ్ ఉన్న హీరో సినిమా వస్తే చాలు మొదటి మూడు రోజులు జనాలతో హాళ్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎస్ఆర్ కళ్యాణమండపం ఫస్ట్ డే ఫుల్స్ పడితే సమ్మతమేకు బిసి సెంటర్స్ లో సగం ఆక్యుపెన్సీ రాలేదు. రెండింటి హీరో కిరణ్ అబ్బవరమే. వీటి మధ్య ఉన్న గ్యాప్ పట్టుమని ఏడాదే. గోపీచంద్ అంతటి ఇమేజ్ ఉన్న స్టార్ కు పక్కా కమర్షియల్ విషయంలో సోసో నెంబర్లు నమోదవుతున్నాయి. పదేసి సినిమాలు వస్తున్నా వందలాది థియేటర్లను పలకరిస్తున్నా అవి వసూళ్లను ఇవ్వనప్పుడు ఏం ఆనందం ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.

విక్రమ్ లాంటి జాక్ పాట్లు ప్రతిసారి రావు. మేజర్ లాంటి దేశభక్తి డ్రామాలు అన్నిసార్లు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఇవి హిట్టయ్యాయి కదాని రిపీట్ చేస్తే బోర్లా పడే ప్రమాదం ఉంది. ఏదో మేజిక్ జరిగి పబ్లిక్ మునుపటిలా కుటుంబాలతో థియేటర్లకు వచ్చేలా చేయాలంటే ఇకపై దర్శక నిర్మాతలు కంటెంట్ అనే మంత్రదండాన్ని మరింత శక్తివంతంగా వాడాలి. కేవలం హీరోల ఇమేజ్ లు నిర్మాతలకు గట్టెక్కించడం లేదు. ఏదో డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్, రీమేక్ అంటూ వివిధ ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే కేవలం థియేట్రికల్ రెవిన్యూ మీద ఆధారపడే పనైతే నిర్మాతలందరూ ఇండస్ట్రీ వదిలి ప్యాకప్ చెప్పుకోవాల్సిందే.