పవిత్ర లోకేష్ అసలు పెళ్లే చేసుకోలేదా?

పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. కన్నడలో కథానాయికగా నటించి.. లేటు వయసులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి పేరు సంపాదించిందామె. హోమ్లీ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన పవిత్ర.. ‘సమ్మోహనం’ సినిమాలో సీనియర్ నటుడు నరేష్‌కు భార్యగా నటించిన సమయంలో ఆయనతో స్నేహం కుదరడం.. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితంగా మెలగడం తెలిసిందే. బయట కొన్ని వేడుకలకు, కార్యక్రమాలకు జంటగా వెళ్లడంతో నరేష్, పవిత్ర కలిసి జీవిస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

ఇంతలోనే నరేష్ మూడో భార్య మీడియా ముందుకు రావడం.. నరేష్ తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని.. అలాగే తనను గన్ను పెట్టి బెదిరించి మరీ విడాకుల కోసం డిమాండ్ చేశారని ఆరోపించడం సంచలనం రేపింది.

దీనికి ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ సైతం బదులిచ్చారు. మరోవైపు పవిత్ర కూడా బెంగళూరు నుంచి మీడియాతో మాట్లాడింది. నరేష్‌తో తన స్నేహం, ఇతర విషయాలపై వివరణ ఇచ్చింది. నరేష్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనొక నిఖార్సయిన జెంటిల్మేన్ అని ఆమె కితాబిచ్చారు. నరేష్ తన జీవితంలో జరిగిందంతా తనకు చెప్పారని.. తమ మధ్య ఏ దాపరికాలూ లేవని ఆమె అన్నారు. ప్రస్తుతం తాను నరేష్‌కు తోడుగా ఉంటున్నానని పవిత్ర చెప్పారు. నరేష్ వ్యక్తిగత విషయాలు ఆయనే చూసుకుంటారని.. అలాగే తన వ్యక్తిగత విషయాలు తాను చూసుకుంటున్నానని.. తమ మధ్య ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఉందని పవిత్ర వివరణ ఇచ్చింది.

నరేష్‌తో గొడవలు ఉంటే రమ్య హైదరాబాద్‌లో చూసుకోవాలని.. కానీ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇక భర్తగా అందరూ భావిస్తున్న సుచేంద్ర గురించి ఆమె వివరణ ఇచ్చింది. సుచేంద్రతో తాను సహజీవనం మాత్రమే చేశానని.. ఆయన తన భర్త కాదని.. మరి ఆయనకు విడాకులు ఇచ్చే ప్రశ్న ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. వికీ పీడియాలో పవిత్ర భర్తగా ఇప్పటికీ సుచేంద్ర పేరు ఉండగా.. ఆయన్ని తాను పెళ్లి చేసుకోలేదని, 2017 నుంచి తాను ఆయనకు దూరంగా ఉంటున్నానని పవిత్ర స్పష్టం చేసింది.