హీరో నేనంటే నేనని కొట్టేసుకున్నారు

ఈ రోజుల్లో చిన్న సినిమాల వైపు ప్రేక్షకులను ఆకర్షించడం.. వారిని థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైపోతోంది. వారిలో ఆసక్తి రేకెత్తించి థియేటర్లకు వచ్చేలా చేయాలంటే క్రేజీ కంటెంట్ ఉండాలి. టీజర్, ట్రైలర్లతో పిచ్చెక్కించాలి. ప్రమోషన్లలోనూ వైవిధ్యం చూపించాలి. ‘హ్యాపీ బర్త్ డే’ టీం సరిగ్గా అలాగే చేస్తోంది. ‘మత్తు వదలరా’తో ఆకట్టుకున్న యువ దర్శకుడు రితేష్ రాణా.. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో రూపొందించిన చిత్రమిది.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, ఆ సంస్థలో ఎప్పట్నుంచో సీఈవోగా ఉంటున్న చెర్రీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక బర్త్ డే పార్టీ సందర్భంగా ఓ రాత్రి జరిగే క్రేజీ ఈవెంట్ల చుట్టూ తిరిగే కథ ఇది. దీని టీజర్, ట్రైలర్ యూత్‌లో బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ప్రోమోలు చూస్తుంటే.. ‘మత్తు వదలరా’ను మించి ఇదొక క్రేజీ రైడ్ లాగా అనిపిస్తోంది. జులై 8న సినిమా రిలీజ్ కాబోతుండగా.. ఈ లోపు ప్రమోషన్లతో ఇంకా ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది టీం.

తాజాగా ‘ఈ సినిమాలో హీరో ఎవరు’ అనే కాన్సెప్ట్‌తో ఒక వీడియో చేశారు సినిమాలోని ముఖ్య పాత్రధారులు. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, గెటప్ శీనులతో పాటు దర్శకుడు రితేష్ రాణా కూడా ఈ వీడియోలో భాగమయ్యారు. ఇదొక టీవీ ఛానెల్లో డిబేట్ నేపథ్యంలో నడిచే వీడియో. గెటప్ శీను దీన్ని హోస్ట్ చేస్తే.. ఈ చిత్రంలో నేను హీరో అంటే నేను హీరో అని సత్య, నరేష్, కిషోర్ టీవీ ఛానెల్ డిబేట్లో కొట్టేసుకోవడం కాన్సెప్ట్ అన్నమాట. సత్య, నరేష్ అగస్త్య టీవీ స్టూడియోలో కూర్చుంటే.. కిషోర్ యూరప్ షూటింగ్ నుంచి వీడియో కాల్ ద్వారా లైన్లోకి వచ్చినట్లు చూపించారు.

ముగ్గురూ కూడా సినిమాలో తనే హీరో అని, తనదే ఇంపార్టెంట్ రోల్ అని.. చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. మధ్యలో లైన్లోకి వచ్చిన దర్శకుడు రితేష్ రాణా ఏ విషయం తేల్చకుండా సైడైపోవడం.. ఈ నేపథ్యంలో ఆద్యంతం ఫన్నీగా సాగింది ఈ ప్రమోషనల్ వీడియో. సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్లే ప్రమోషన్లు కూడా వెరైటీగా ఉండడంతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.