వ‌ర్మ గారూ.. ఇక లాగ‌కండి తెగుద్ది


కాలం క‌లిసొచ్చిన‌పుడు, ఫాంలో ఉన్న‌పుడు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా న‌డుస్తుంది. కానీ దానికి భిన్న‌మైన ప‌రిస్థితుల్లో ఎంత సైలెంటుగా ఉంటే అంత మంచిది. అందులోనూ మ‌హిళ‌ల‌కు సంబంధించిన‌ సున్నిత‌మైన విష‌యాల్లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేస్తే న‌డ‌వ‌దు. ప‌రిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ఈ విష‌యంలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు కొంచెం లేటుగా అర్థ‌మైన‌ట్లుంది. సాఫ్ట్ టార్గెట్స్ చూసుకుని ట్విట్ట‌ర్లో రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ర్మ‌కు అల‌వాటు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలను వర్మ అదేపనిగా ఎలా కెలుకుతూ ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ఆదివాసి మహిళా నేత ద్రౌపది ముర్ము గురించి కూడా అవాకులు చవాకులు పేలి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.

ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అంటూ వెకిలి వ్యాఖ్యలు చేయడంతో వర్మను నెటిజన్లు గట్టిగా తగులుకొన్నారు. ఇన్నాళ్లు వర్మ ఏం చేసినా చెల్లింది కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం వర్మ కు పెద్ద తలనొప్పి తెచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఎన్నడు లేని విధంగా వర్మ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ ఆ వివరణ పేలవంగా ఉండటంతో వర్మకు త‌ల‌నొప్పి తప్పట్లేదు. ఇక లాభం లేదు అని వర్మ ఇంకో మార్గం ఎంచుకున్నాడు.

ద్రౌపదిని తనదైన శైలిలో పొగడడం మొదలుపెట్టాడు. ద్రౌపది రాష్ట్రపతి అయితే కౌరవులు పాండవులు అందరు ఒకటై పోతారని.. ఆమెను ఆరాధిస్తారని వ్యాఖ్యానించాడు. అంతేకాక ద్రౌపది కళ్ళు సూపర్ అని.. ఆమె నవ్వు అద్భుతమని ఫోటోలు పెట్టి సిల్లీ కామెంట్లు చేశాడు. కానీ ఎంత చేసినా ఫలితం లేకపోయింది. నెటిజన్లు కరగలేదు. ఆయనపై మరింతగా అటాక్ చేస్తున్నారు. చేసిన తప్పుకు సారి చెప్పి ఊరుకోకుండా.. ఎందుకీ సాగతీత.. సిల్లీ కామెంట్లు అని వర్మకు గడ్డి పెడుతున్నారు.